ఎవరీ పుట్టా సుధాకర్ యాదవ్?

Published : Oct 21, 2017, 12:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఎవరీ పుట్టా సుధాకర్ యాదవ్?

సారాంశం

తెలంగాణకు నీళ్లు, ఆంద్రోళ్లకు నోట్లు పారిస్తున్నది మిషన్ భగీరథ

 

తెలంగాణ  టిడిపి రెబెల్ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మీద వేసిన బాంబు  అనూహ్యమయిన ప్రకంపనలు సృష్టించింది.  యనమల రామకృష్ణుడు రెండు వేల కోట్ల కాంట్రాక్టు పనులను కెసిఆర్ నుంచి పొందారని రేవంత్  బయటకు చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర కాంట్రాక్టర్లకు మధ్య సాగుతన్న  మిత్రలాభం బయటపెట్టారు.  రేవంత్ ఆరోపణలతో యనమలకు కాంట్రాక్టులేమిటి అని చర్చ మొదలయింది.  చివరకు తెలిసింది, అసలు లబ్ది దారు ఆంధ్ర టిడిపి నాయకుడు, యనమలకు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు  వియ్యంకుడయిన పుట్టాసుధాకర్ యాదవ్అని.

 

 

పుట్టా ఇటీవల పైకొచ్చిన ఆంధ్రా కాంట్రాక్టర్లలో ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ. ఈ సక్సెస్ వల్లే ఆయన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు, ఆంధ్ర ఆర్థిక మంత్రి  యనమల రామకృష్ణుడికి వియ్యంకుడయ్యారు.

ఈ కడప జిల్లాలోని ధనవంతులలో పుట్టాసుధాకర్ ఒకరు. పేరు మోసిన కాంట్రాక్టర్. తెలుగుదేశం బాస్ కు ఇష్టమయిన రెండో కడప జిల్లా కాంట్రాక్టర్ . (మొదటి వ్యక్తి రాజ్యసభ ఎంపి సిఎం రమేశ్)ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిటిడి ఛెయిర్మన్ పోస్టు ఇవ్వాలనుకున్నది  కూడా అందుకే. అయితే, మైదుకూరు రాజకీయాలు ఆయన కు ఇపుడు అడ్డొస్తున్నాయి. చంద్రబాబు కడప జిల్లా రెడ్లందరిని  టిడిపి లోకి లాక్కోవాలనుకుంటున్నారు. యితే, వాళ్ల కోసం పుట్టా లాంటి వాళ్లని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఇదే   ప్లాన్ అమలుచేస్తున్నపుడే  పుట్టా సుధాకర్ ను అమాంతం టిటిడిలో ట్రస్టుబోర్డులో కూర్చొబెట్టాలనుకోవడం వల్లే కాంగ్రెస్ నాయకుడు డిఎల్ రవీంద్రరెడ్డి తెలుగుదేశం రావడానికి బ్రేక్ పడింది. మైదుకూరు నియోజకవర్గంలో పుట్టారవీంద్ర రెడ్డి పెత్తనం కింద పనిచేసేందుకు డిఎల్  రవీంద్రరెడ్డి  సుముఖంగా లేరు. ఈ వ్యవహారం తాను అమెరికా నుంచి వచ్చాక తెలుస్తానని రవీంద్రరెడ్డికి ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం.

పుట్టాసుధాకర్ యాదవ్ ది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండంలోని జడ్ కొత్తపలి అనే  వూరు.  ఈ వూర్లో 300  మించి వోట్లు ఉండవు. వూర్లో ఉండేది రెండే కులాలు- రెడ్లు, గోల్లలు.సుధాకర్ చాలా చిన్నకుటుంబం నుంచే వచ్చారు. మొదట వెంకట్రామయ్య అనే యాదవ కాంట్రాక్టర్ దగ్గిర గుమాస్తాగా పనిచేశేవాడని, ఆయన సహకారంతో మెల్లిగా చిన్న చిన్న రోడ్ల  కాంట్రాక్టు పనులూ చేస్తూ తర్వాత  పీఎస్‌కే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థను స్థాపించే స్థాయికి ఎదిగారని చెబుతారు. జాతీయ రహదారుల కాంట్రాక్టులు చేసే పీఎస్‌కే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ టర్నోవర్ ప్రస్తుతానికి 5వేల కోట్ల నుండి 10వేల కోట్లవరకూ చేరిందని చెబుతారు.  ఈ సంస్థకు ఆయన ఛెయిర్మన్. ఆయనకు తెలంగాణలో మిషన్ భగీరథ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజక్టు కాంట్రాక్ట్ పనులతో పాటు కొన్ని రోడ్ కాంట్రాక్టులు మొత్తంగా రెండువేల విలువయన కాంట్రాక్టులు ఇప్పించేందుకు యనమల రామకృష్ణుడు స్వయంగా కెసిఆర్ సంప్రదింపులు జరిపారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దీన్ని ఇంతవరకు ఎవరూ ఖండించలేదు. యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు విదేశాలలో ఉన్నందున స్పందించకపోయి ఉండవచ్చు.

ఇలా పెద్దవాడయిన పుట్టాసుధాకర్ యాదవ్  రెండు రాష్ట్రాలలో వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నాడు. 2014లో టిడిపి తరఫున మైదుకూరు అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసిపి అభ్యర్థి రఘురామిరెడ్డి గెలిచారు. తర్వాత 2014 నుంచి 2016 వరకూ సుధాకర్ యాదవ్ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా సేవలందించారు. ఇపుడాయనకు  టిటిడి ఛెయిర్మన్ పదవి రాబోతున్నది. ఈ మధ్య ఆయన క్రైస్తవుడని, ఆయనకు టిటిడి వంటి హిందూ ధార్మిక సంస్థ బాధ్యతలు అప్పగించడం సబబు కాదని గొడవ కూడా జరిగింది. టిటిడి ఛెయిర్మన్ పదవి రాకపొయేందుకు ఈ విమర్శ కారణం కాకపోయినా, మైదుకూరు జిల్లాలో కొంత మంది రెడ్డి ప్రముఖులకు సుధాకర్ యాదవ్ తో విబేధాలున్నాయి. వారంతా టిడిపి లోకిరావాలనుకుంటున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పిన ముఖ్యమంత్రి టిటిడి పదవి ప్రకటిస్తారని రాజకీయవర్గాలలో వినపడుతూ ఉంది.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu