NEWS
అప్పుల బాధ తట్టుకోలేక ఇద్దరు తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
మునుగోడు మండలం వెల్మకన్నెకు చెందిన మారెమ్మ(58), యాదయ్యలు తల్లీ కొడుకులు. వీరు వ్యవసాయ పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు దగ్గర అప్పు చేశారు. అయితే ఈ మద్య అప్పు తీర్చాలని వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి పెరగడం, అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ ఆర్థిక ఇబ్బందులను భరించలేక తల్లీ కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.