
ప్రతిదానికి సింగపూర్ లక్ష్యం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ఇబ్బందికరమయిన సలహా ఇచ్చారు.
ఈ సింగపూర్ మోడల్ వదిలేసి మరొక దేశీ మోడల్ వెదుక్కుంటే మంచిదన్నారు.
అమరావతి ప్రజారాజధాని అని చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రికి సింగపూర్ తరహా పరిపాలన ప్రజల మీద ఎలా భారమవుతుందో మదన్ న్యాయవ్యవస్థ పరంగా వివరించి చెప్పారు.
జస్టిస్ లోకూర్ గతంలో హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయ మూర్తిగా కూడా పనిచేశారు.
సింగపూర్ రోడ్లు, ఎత్తయిన బిల్డింగులు,అన్నింటికంటే ముఖ్యంగా లీ కువాన్ యూ మూడు దశాబ్దాలు బ్రేక్ లేకుండా పార్టీకి, నగరరాజ్యానికి అధినేత గా ఉండటం చూసి ఆంధ్రా ముఖ్యమంత్రి సింగపూర్ మోడల్ మీద మోజు పడుతూ ఉండవచ్చు.
సింగపూర్ ఆ స్థితికి రావడాని భౌగోళిక స్థావరం తో పాటు, అక్కడి రాజకీయ మోడల్ దోహదపడ్డాయి. ఇవి గుర్తించకుండా అమరావతిలోసింగపూర్ బొమ్మ గీసేసి సింగపూర్ లా అమరావతి అందామనుకుంటున్న ముఖ్యమంత్రికి జస్టిస్ లోకూర్ కొంచెంఘాటుగా నే సలహా ఇచ్చారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇలా పబ్లీకున ఎవరూ ఇలా సలహా ఇచ్చి ఉండరేమో...
జరిగిన రెండ్రోజుల అంతర్జాతీయ న్యాయ సదస్సు లో ‘ఆస్తి చట్టాలు, వివాహ చట్టాలు, బాలల హక్కుల అంశం, వాణిజ్య దావాల్లో ఆర్బిట్రేషన్’ అంశంపై
జస్టిస్ లోకుర్ మాట్లాడారు. జస్టిస్ లోకూర్ ఎమన్నారో చూడండి.
సింగపూర్లో కేసులు తొందరగా పరిష్కారం అవుతాయనేది ఒక పార్శ్వం మాత్రమేనని ఆయన అన్నారు. ఈ విషయం పక్కన పెడితే అక్కడ న్యాయ వ్యవస్థ, ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) ఫీజులు సామాన్యులకు అందుబాటులో ఉండవని, చాలా ఆర్థిక భారం మోపుతాయన్న విషయం విస్మరించరాదని హెచ్చరించారు.
భారత దేశం న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి 300 ఏళ్లు పడుతోందన్న వాదనతో తాను ఏకీభవించనని ఆయన చెప్పారు.
‘ నా సర్వీసులో నేనెప్పుడూ 300 ఏళ్ల నాటి కేసు చూడలేదే. నేను చూసిన పాత కేసు ఒకే ఒక్కటి. అది 1960నాటిది. అదికూడ దేశ విభజన కాలం నాటిది. ఆ కేసులోని కొందరు పాకిస్థాన్కు వలసవెళ్లిపోవడంతో పరిష్కారం ఆలస్యమైంది,’ అని అన్నారు. చాలా మటుకు కేసులు ఏడాది, ఏడాదిన్నరలో కూడా పరిష్కారమవుతున్నాయని గుర్తుచేశారు.
సింగపూర్ కేసులు మోపే అర్థిక భారం గురించి చెబుతూ తన అనుభవం వివరించారు.
‘ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసొకటి నా కోర్టు పరిశీలనకు వచ్చింది. అది భార్యాభర్తల విడాకుల వ్యవహారం. భార్య భారత దేశంలో ఉన్నారు. భర్త సింగపూర్లో ఉన్నారు. బిడ్డ తండ్రి దగ్గర ఉంది. బిడ్డను తనకు అప్పగించాలని తల్లి కేసు వేసింది. తల్లికి ఇవ్వాలని కోర్టు తీర్పు వచ్చింది. అయితే బిడ్డ సింగపూర్లో పుట్టంది కాబట్టి, సింగపూర్ పౌరసత్వం ఉందని.. దీనికి భారత తీర్పులు వర్తించవని తండ్రి వాదించాడు. దీంతో సింగపూర్లో ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఆశ్రయించాలని భార్యకు సలహా ఇచ్చాం. ఆమె సింగపూర్ ఆర్బిట్రేషన్ కేంద్రం సంప్రదించారు. మధ్యవర్తిత్వానికి వారు అంగీకరించారు. అయితే, ఫీజు ఎంత అడిగారోతెలుసా?
ఒక్కో పార్టీ రోజుకు లక్ష రూపాయలు చెల్లించాలి. సింగపూర్ రాలేనని, ఇబ్బందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యవర్తిత్వం చేయాలని అడిగారు. అపుడు పీజు ఇంకా పెరిగింది. వీడియో కాన్సరెన్స్ కు అదనంగా మరొక రూ.50 వేలు కలిపి.. రూ.1.5 లక్షల చొప్పున రెండు పార్టీలు చెల్లించాలని అడిగారు. సింగపూర్, చైనా, జపాన్ లాంటి దేశాలలో ఆర్బిట్రేషన్ చాలా ఖర్చు తో కూడా కున్న వ్యవహారం. అందుకే ఆ నమూనాలు మనకు అవసరం లేదు. భారత తన సొంత నమూనాను అభివృద్ధి చేసుకోవాలి’అని ముక్కు సూటిగా చెప్పారు.