
సొంత మొక్కబడులు తీర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాజ్యాంగ విరుద్ధంగా ఖర్చుచేసిన దాదాపు రు.10 కోట్లను ఆయన నుంచి వసూలు చేసేందుకు ఆదేశించాలని హైదరాబాద్ కు చెందిన పలువురు మేధావులు హైకోర్టుకు ప్రధాన నాయమూర్తికి ఒక పిటిషన్ పెట్టారు.
ఇదే విధంగా, ముఖ్యమంత్రి మొక్కులు తీర్చుకునేందుకు ప్రభుత్వం సొమ్ము వాడుకునే వీలుకల్పిిస్తూ ఇచ్చిన జివొ ఎంఎస్ 23 ని కూడా రద్దు చేయాలని ఈ మేధావులు ప్రధానన్యాయమూర్తికి పంపిన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ మీద సంతకం చేసిన వారిలో సంఘసేవిక డాక్టర్ లూబ్నా సర్వత్, అడ్మిరల్ రామ్ దాస్, లలితా రామ్ దాస్, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, కెప్టెన్ జె రామారావు, స్వాడ్రన్ లీడర్ నిర్మలా చక్రవర్తి, డాక్టర్ జెస్వీన్ జైరత్, డాక్టర్ సి.ఎస్ రామచంద్రయ్య, ఒమిన్ మానెక్ షా దేబరా,డాక్టర్ మంతోష్ మండల్, న్యాయవాది మామిడి వేణుమాధవ్,మాదాను మారయ్య, కమడ్ర్ సుధీర్ పరకాల, ప్రొఫెసర్ కీర్తనా తంగవేలు, అడ్వకేట్ ఇమ్రాన్ ఖురేషి, కెప్టెన్ బక్తియార్ కావూస్జీ, మాజీ ఐఎఎస్ అధికారి ఛాయారతన్, అనితారావ్, డాక్టర్ బాబూరావ్ కలపాల, థామస్ పీటర్, కావూరి సరస్వతి,మసూద్ తదితరులు ఉన్నారు.
ఈ పిటిషన్ ను పిల్ గా స్వీకరించేందుకు వీలుంటుంది
పిటిషన్ లో ఈ మేధావులు లెవనెత్తిన విషయాలు:
ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కుబడి తీర్చుకునేందుకు రు. 5 కోట్ల విలువయిన కాన్కలు తిరుమల వేంకటేశ్వరుడికిసమర్పించేందుకు అనుమతిస్తూ ఫిబ్రవరి 24,2015న జారీ చేసిన GO MS No 23, రద్దుచేయాలి.
మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం సుమారు రు. 10 కోట్ల ప్రజాధనాన్ని వివిధ గుడులలో దేవతలకు మొక్కుబడి తీర్చేందుకు ఖర్చు చేశారు. ఈ కాన్కలు :
*వేంకటేశ్వర స్వామికి వజ్రకిరీటం, హారం,
*పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక
*వీరభద్ర స్వామికి బంగారు మీసాలు
*వరంగల్ భద్రకాళికి స్వర్ణ కిరీటం
*విజయవాడ కనకదుర్గకు ముక్కుపుడక
ఇవి కాకుండా వక్ఫ్ నిధులనుంచి ముఖ్యమంత్రి అజ్మీర్ దర్గాకు చదర్ కూడా బహూకరించారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈఖర్చుల గురించి తామే ఫిబ్రవరి 25, 2015లో ముఖ్యమంత్రికేసమర్పించిన లేఖను కూడా వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో 2015, ఫిబ్రవరి 24 న జారీ చేసిన జివొ 23 చెల్లదని, రాజ్యాంగ వ్యతిరేకమని ఆదేశించాలని వారు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
దేవాదాయ శాఖ, వక్ఫ్ నిధులే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇతర ఆదాయం నుంచి ముఖ్యమంత్రి సొంతమొక్కబడి కి నిధులు విడుదల చేయడం చెల్లదని, అది చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ వ్యతిరేకమని వారు చెప్పారు. ఇది తెరాస ప్రభుత్వం మీద ప్రజలుంచిన విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తున్నదని వారు పేర్కొన్నారు.
జివొ 23 ప్రకారం ఇంతవరకు ఏయే గుళ్లకు ఎన్నెన్ని కాన్కలిచ్చారో, వాటి వివరాలను, ఖర్చులను వెల్లడిస్తూ ఒక శ్వేత పత్రం ప్రకటించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కూడా వారు ప్రధాన న్యాయ మూర్తిని కోరారు.
‘ ఏ మత ప్రార్థనా సంస్థకైనా కాన్కలను సమర్పించే స్వేచ్ఛముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఉంది. అయితే, ఈ కాన్కలు తన సొంత నిధులు వెచ్చించే మాత్రం సమర్పించాలి. అయితే, దీనికి విరుద్ధంగా ప్రభుత్వం నిధులను వెచ్చించినందున, నిధలను ఆయన నుంచి వసూలు చేయాలి. అంతేకాదు, ఈ నిధులనుసమర్పించేందుకు ఆయన పరివారం, శాసన సభ్యులు, మంత్రులు,ఇతర మిత్రులు వెచ్చించిన దారి , ప్రయాణం ఖర్చులను కూడా వసూలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలి,’ అని వారు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
ఇలాంటిధోరణి ప్రమాదకరమని చెబుతూ దీనిని అరికట్టేందుకు జోక్యం చేసుకోవాలని కూడా వారు కోరారు.