
గత ఆర్థిక ఏడాది వరకు బంగారం ధరలు గమనిస్తే పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గుదల నమోదయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో అదే పరిస్థితి కనిపిస్తుందా లేక ధరల్లో స్థిరత్వం వస్తుందా.. ఇప్పటికైతే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ముఖ్యంగా అంతర్జాతీయ ఒడిదుడుకులు, దేశీయంగా మార్కెట్ పరిస్థితి మలుపులు తిరగడంతో ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో ముందే అంచనా వేయడం సాధ్యంకాదని బులియన్ నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడైనా అంతర్జాతీయ ప్రభావం, దేశీయ మార్కెట్ కు అనుగుణంగానే పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయని అంటున్నారు.
మరోవైపు గత కొంతకాలంగా ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి.
దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,840 రూపాయిలకు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా రూ.112 పెరిగి 42,370 రూపాయిలకు చేరుకుంది.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థికవిధానాలకు ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇదే బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.