
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఈరోెజు 9మంది కొత్త వ్యక్తులు కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. కాగా.. ప్రభుత్వం, పార్టీ మాత్రం ఒక వ్యక్తి గురించి తెగ చర్చించుకుంటోంది. ఆయన ఐపీఎస్ మాజీ అధికారి ఆర్కే సింగ్. 9మంది మంత్రి వర్గంలో చోటు దక్కించుకోగా.. కేవలం ఆయన గురించే ఎందుకు చర్చించుకుంటున్నారు..?
సరిగ్గా 27 సంవత్సరాల క్రితం బీజేపీ అగ్ర నేత, కురు వృద్ధుడు ఎల్ కే అద్వాని రామ మందిర నిర్మాణం కోసం రథ యాత్ర చేపట్టారు. గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు యాత్ర చేయాలని అప్పట్లో ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో అద్వానీ బీహార్లోకి ప్రవేశించారు. అప్పుడు ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీనికోసం ఇద్దరు అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించారు. అందులో ఒకరు రాజ్కుమార్ సింగ్. ఆయనే ఇప్పుడు మోదీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేయడం గమనార్హం.
1975వ బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధాకారి ఆర్కే సింగ్. ఆయన 1990 లో బీహార్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వ ప్రత్యేక హెలికాప్టర్లో ఆర్కే సింగ్ పాట్నా నుంచి సమస్తిపూర్కు వెళ్లారు. ఆయన వెంట ఐపీఎస్ ఆఫీసర్ రామేశ్వర్ ఓరాన్ కూడా ఉన్నారు. అద్వానీ ఉన్న సర్క్కూట్ హౌజ్కు వెళ్లి.. మిమ్మల్ని అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ అయింది అని చెప్పింది ఆర్కే సింగే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అద్వానీ తీసుకొని మళ్లీ పాట్నా వెళ్లారు. ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మసాంజర్ గెస్ట్ హౌజ్కు అద్వానీని తరలించారు.
ఈ రథ యాత్ర ముగిసిన ఆరేళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోంమంత్రి అయ్యారు. ఇప్పుడు అద్వానీ కేవలం ఎంపీ పదవికే పరిమితమవగా.. ఆయను అప్పట్లో అరెస్ట్ చేసిన ఆర్కే సింగ్ మంత్రి అయ్యారు. 1975 బ్యాచ్ బీహార్ కేడర్ ఆఫీసర్ అయిన రాజ్కుమార్ సింగ్.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. బీహార్లోని ఆరా నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు.
అయితే.. మోదీ.. అద్వానిని గురువుగా భావిస్తారు. అలాంటిది.. తన గురువునే అరెస్టు చేసిన వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.