NEWS
పెట్రోల్, డీజిల్ లకి ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ ఇంజన్ తయారీపై ఇప్పుడు అన్ని కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. భవిష్యత్తులో అన్ని కంపెనీలు తమ వాహనాలకు ఎలక్ట్రిక్ ఇంజిన్ ఏర్పాటు చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా.. తొలిసారి భారత్ కూడా ఆ దిశగా అడుగుపెట్టింది. భారత తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ఆటో ఎక్స్ పో-2018 ప్రదర్శనకు వచ్చింది. బెంగుళూరుకు చెందిన స్టార్టప్ ఎమ్ఫ్లక్స్ మోటార్స్ సంస్థళ ఎమ్ఫ్లక్స్ వన్ బైక్ను ప్రదర్శించింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ఇదే.
గంటకు 200కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ నడుస్తుంది. అతి త్వరలోనే ఈ బైక్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది జులై నుంచి ప్రీ ఆర్డర్లు మొదలుకానున్నాయి. 2019 ఏప్రిల్ నుంచి బైక్స్ ను కొనుగోలుదారులకు అందజేస్తారు. అయితే, ఎమ్ఫ్లక్స్ వన్ బైక్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం. దాదాపు రూ.5.5లక్షల నుంచి రూ. 6లక్షల వరకూ దీని ఖరీదు ఉండనుందని మార్కెట్ వర్గాల టాక్. బైక్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే అమ్మనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.