
రైల్వేలకు ప్రధాని బుల్లెట్ ట్రయిన్ దెబ్బ తగులుతూ ఉందని పర్యావరణ వేత్త ,కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ అన్నారు.
ఉత్తర ప్రదేశ్ ఘోర రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఒక లేఖ రాస్తూ ప్రధాన మంత్రి భారీ ప్రాజక్టుల వల్ల భద్రత అనేది ఎలా మరుగున పడిందో వివరించారు.
‘ ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని తన పని తాను చేసుకుపోయారన్నట్లుగా ఆత్మీయులను పొగొట్టుకున్న కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రజల సొమ్ము నుంచి ఆర్ధిక సహాయం చిలకరించి దీనితో అంతా సర్దుకు పోతుందనే భావం కల్గించే ప్రయత్నం చేశారు. రైల్వే బోర్డు కూడా యధావిధిగా నాలుగు చుక్కలు పనికి రాని కన్నీళ్లు రాల్చింది’ అని వ్యాఖ్యనించారు. ఇలాంటి ధోరణి వల్ల భారతీయ రైల్వేలో ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అవసరమయిన జీరో టాలరెన్స్ లేకుండాపోయిందని డాక్టర్ శర్మ అభిప్రాయపడ్డారు.
అట్టహాసంగా బుల్లెట్ ట్రెయిన్ ప్రాజక్టును ప్రకటించి, రైల్వే భద్రత కోసం మిగిలిన కొద్ది పాటి నిధులను కూడా తాను పక్కకు మళ్లించానన్న విషయం ప్రధానికి తెలుసా? వేగంగా నడిచే రైళ్ల పేరుతో విదేశీకంపెనీలకు కాంట్రాక్టులప్పగించడంలో కనబర్చిన ఆదుర్దాలో, ఈ స్పీడు రైళ్లొస్తే, ప్రమాదాలు జరిగే అవకాశాలెక్కవవుతాయన్న విషయం కూడా ప్రధాని గమనించలేదని అయన లేఖలో పేర్కొన్నారు.
బుల్లెట్ రైళ్లొస్తే మాదావకాశాలు తగ్గడం కాదు, పెరుగుతాయని ఆయన హెచ్చరించారు.
చూస్తుండగానే గాలిలో కలసిపోతున్న ప్రయాణికుల ప్రాణాల పట్ల ప్రభుత్వంలో ఏవరికైన చీమకుట్టినట్లయిన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘ బుల్లెట్ ట్రెయిన్స్, అన్ని రైల్వే స్టేషన్ లలో వైఫై సౌకర్యం అనేవి ఎవరో కొద్ది మంది తెలివిమీరిన పెద్దబాబులను ఆకట్టుకునేందుకు పనికొస్తాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంతకంటే ముఖ్యం ప్రమాదాల పట్ల జీరో టాలరెన్స్,’ అని ఆయన చెప్పారు.
అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడిగా, ధైర్యంగా, బల్లెట్ ట్రెయిన్, వైఫై లకంటే ప్రయాణికుల భద్రతే ముఖ్యమనే నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధానికిసూచించారు.
నిధుల కొరత ఉండే ఆర్థిక వ్యవస్థలలో సొంత ఇష్టాఇష్టాల ప్రకారం అట్టహాసాలకు పోకుండా తెలివిగా బడ్జెట్ కేటాయింపులుజరిపాలని డాక్టర్ శర్మ సూచించారు. ఉత్తర ప్రదేశ్ ప్రమాదంలో దాదాపు 140 మందికి పైగా చనిపోవడమనేది, రైల్వేల పట్ల మనకున్న మొక్కుబడి శ్రద్ధవల్లేనని ఆయన చెప్పారు.
ఈ ప్రమాదం చూశాక, ప్రజలు రైల్వే శాఖను క్షమించడం కష్టమని ఆయన అన్నారు.