కొండను తవ్వి... పట్టేది ఎలుకనేనా

Published : Dec 02, 2016, 12:55 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
కొండను తవ్వి... పట్టేది ఎలుకనేనా

సారాంశం

దేశంలో తలెత్తిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రధాని కూడా తన ప్రయత్నం దారుణంగా బెడిసి కొట్టిందనే అభిప్రాయానికి వచ్చినట్లే ఉంది.

నల్లధనాన్ని వెలికితీయటమనే ప్రయత్నంలో మోడి ప్రభుత్వం విఫలమైనట్లేనా? మోడి ప్రయత్నమంతా ‘కొండను తవ్వి ఎలుకను పట్టట’మేనా? దేశంలో తలెత్తిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రధాని కూడా తన ప్రయత్నం దారుణంగా బెడిసి కొట్టిందనే అభిప్రాయానికి వచ్చినట్లే ఉంది. నల్లధనాన్ని వెలికి తీయటమే ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి హటాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసారు.

 

మార్కెట్లో చెలామణిలో ఉన్న మొత్తం 16.5 లక్షల కోట్ల కరెన్సీలో రూ. 1000, రూ. 500 నోట్ల వాటానే రూ. 14.5 లక్షల కోట్లుంటుందని ఆర్బిఐ చెప్పింది. రద్దైన పెద్ద నోట్లు బ్యాంకులకు రావటానికి డిసెంబర్ 30వ తేదీన గడువుగా కేంద్రం ప్రకటించింది. ఒక్కసారిగా ఆ నోట్లన్నీ రద్దు చేస్తే నల్లధనం మొత్తం బయటకు వస్తుందని ప్రధాని ఊహించారు.

 

అయితే, తాజాగా కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, నిపుణుల విశ్లేషణలు వింటుంటే మోడి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లే వుందనిపిస్తోంది.

 

మోడి అంచనా ప్రకారం రద్దైన మొత్తం కరెన్సీ విలువలో గడవు ముగిసేటప్పటికి వెనక్కు వచ్చేది 10 లక్షల కోట్ల రూపాయలుంటుంది. మిగిలే 4 లేదా 5 లక్ష్లల కోట్లంతా నల్లధనంగానే మగ్గిపోతుందని. అంటే, బ్యాంకులకు రాని ఆ మొత్తమంతా ఆర్బిఐ ఖాతాలో లాభంగా మారిపోతుంది. ఆ మొత్తాన్ని ఆర్బిఐ డివిడెండ్ గా కేంద్రానికి బదలాయిస్తుంది. దాంతో ఎంత లేదన్నా నల్లధనం రద్దు వల్ల కేంద్రానికి సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు లాభం వస్తుందని అంచనా.

 

ఇక్కడే ప్రధాని అంచనా దారుణంగా దెబ్బనేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగంటే, నోట్ల రద్దైనప్పటి నుండి ఇప్పటి వరకూ బ్యాంకులకు వచ్చిన పెద్ద నోట్ల విలువ సుమారు 11 లక్షల కోట్లు. అంటే ఇంకా రావాల్సింది మహా ఉంటే 4 లేదా 5 లక్షల కోట్లే. ఆ మొత్తం వెనక్కురావటానికి ఇంకా 28 రోజులుంది. ఈ లెక్కన అంచనా వేసినదానిలో సగం అంటే మరో రూ. 2 లక్ష్లల కోట్ల రూపాయలు వచ్చినా చాలు ప్రధాని పథకం విఫలమైనట్లే.

 

భారీ క్యూలకు జడిసి నల్లధనమున్న వారు బ్యాంకుల్లలో జమ చేయటం లేదనుకుంటే అంతకు మించిన పిచ్చితనం మరోటి ఉండదు. ఎందుకంటే, నల్లధన కుబేరులంతా తమ వద్ద ఉన్న మొత్తాలను ఎప్పుడో తెల్లధనంగా మార్చేసుకున్నారు. లేకపోతే మార్చుకుంటారు. నిజంగా అదే జరిగితే గనుక దేశంలో నల్లధనం లేదనుకోవలేమో.

 

అంటే ఎటుతిరిగీ నష్టపోయింది, నానా యాతనలు పడుతున్నది మాత్రం సామాన్య ప్రజలే. ఈ విషయంలోనే యావత్ దేశమంతా మోడిపై దుమ్మెత్తిపోస్తున్నది. ఎందుకంటే ఈ యాతనలు మరో ఎనిమిది నెలలు తప్పవని నిపుణులు చేస్తున్న హెచ్చరికలతో దేశప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu