ఆస్తికోసం తండ్రిని దారుణంగా కొట్టిచంపిన కొడుకులు

First Published Apr 4, 2018, 6:48 PM IST
Highlights
నల్గొండ జిల్లాలో దారుణం

ఆ తండ్రి పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. వారికి ఏ లోటూ రాకుండా విద్యాబుద్దులు చెప్పించి ప్రయోజకులను చేశాడు. కానీ నాన్న తమపై చూపించిన ప్రేమ, ఆప్యాయత కంటే అతడి ఆస్తే తమకు ముద్దనుకున్నారు తనయులు. దీనికోసం  కన్న తండ్రినే అతి దారుణంగా హతమార్చారు. ఈ దుర్ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... జిల్లాలోని హాలియా కు చెందిన గోవిందరెడ్డి(60) కి ఇద్దరు కుమారులు. ఇద్దరికి పెళ్లిల్లయ్యాయి. అయితే ఆస్తి పంపకాల కోసం కొంత కాలంగా ఈ ఇద్దరు తనయులు తండ్రితో గొడవపడుతున్నారు. ఇదే విషయంలో ఇవాళ మరోసారి గొడవ జరిగింది. దీంతో ఇద్దరు కొడుకులు కలిసి తండ్రి గోవిందరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. తండ్రిపై దాడి చేస్తున్న వారిని అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు, ప్రస్తుతానికి వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.    

click me!