వైసీపీలోకి మరో కీలకనేత

First Published Apr 19, 2018, 10:57 AM IST
Highlights

వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మరో కీలక నేత సిద్ధమయ్యారు.

వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మరో కీలక నేత సిద్ధమయ్యారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి త్వరలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. బుధవారం  కర్నూలు నగర శివారులోని వీజేఆర్‌ కన్వెన్షన్‌ హాలులో పార్టీ మార్పుపై కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరి, కుమారుడు శివ నరసింహారెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల, ఓర్వకల్, కల్లూరు మండలాల నుంచి  వేలాదిమంది  తరలివచ్చారు. ముందుగా ప్రభాకరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో  కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు.

కాగా.. కాటసాని వైసీపీలో చేరితే బాగుంటుందని కార్యకర్తలు ఆయనకు సూచించారు.  ఈ  సందర్భంంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్‌ కోసం  కార్యకర్తలు, అనుచరులు చూపుతున్న అభిమానం, ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మీరంతా ఏ పార్టీ సూచిస్తే ఆ పార్టీలో చేరుతానని  కాటసాని వెల్లడించారు.   రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంతో రాజకీయ సమీకరణాలు మారాయని..దాంతో పార్టీ మారాల్సి వస్తోందన్నారు. అభిమానుల సూచనల మేరకు  తాను త్వరలో జగన్ సమక్షంలో వైసీపీ లో చేరతానని ఆయన ప్రకటించారు.
 

click me!