కోడెల...సన్నాయి నొక్కులు

Published : Oct 31, 2017, 12:30 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
కోడెల...సన్నాయి నొక్కులు

సారాంశం

అసెంబ్లీ సమావేశాలను వైసీపీ నేతలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా సమావేశాలకు హాజరైతే బాగుంటుంది కోడెల చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలు సమావేశాలకు హాజరుకావడం వల్ల వారికి వచ్చే లాభాలు ఏంటి?

‘ సమావేశాలకు అందరూ హాజరైతే బాగుంటుంది’.. ఇది ఏపీ స్పీకర్ కోడెల ఆకాంక్ష. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను వైసీపీ నేతలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా సమావేశాలకు హాజరైతే బాగుంటుంది కోడెల చెబుతున్నారు. కోడెల అలా కోరుకోవడం బాగానే ఉంది.. కానీ.. ప్రతిపక్ష నేతలు సమావేశాలకు హాజరుకావడం వల్ల వారికి వచ్చే లాభాలు ఏంటి? కనీసం సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వనప్పుడు వారు వచ్చి ఏమి చెయ్యాలి.

తాను సభలో ఎప్పుడూ నిష్పక్షపాతంగానే ప్రవర్తించానని కూడా కోడెల చెప్పారు. అయితే.. గతంలో జరిగిన సమావేశాలను ఒక్కసారి చూస్తే సరిపోతుంది.. కోడెల ఎంత నిష్పక్షపాతంగా ప్రవర్తించారో..? జగన్ ని, వైసీపీ నేతలను ధూషించడానికి అధికార పార్టీ నేతలకు గంటల కొద్దీ సమయం కేటాయించే స్పీకర్.. జగన్ మాట్లాడటానికి కనీసం పది నిమిషాలు కూడా కేటాయించలేదన్నది వాస్తవం. చాలా సార్లు సమయం ఇచ్చినట్టే ఇచ్చి... మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్ కట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఒక్క జగన్ విషయంలోనే కాదు.. ఇతర వైసీపీ నేతలకు కూడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సారి సమావేశాలకు హాజరైనా ఇదే పునరావృతం అవుతుందన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సభకు రావాలని వైసీపీ నేతలు ఎందుకు భావిస్తారు?

సరే ఈ విషయం పక్కన పెడితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తే.. వాళ్లు రాజీనామాలు చేస్తే.. తాము సమావేశాలకు హాజరౌతామని కూడా చెప్పారు. నిజంగా వైసీపీ నేతలు సభకు హాజరుకావాలని కోడెలకు ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించవచ్చు కదా. అది ఆయన చేతిలో పనే కదా. మరి ఎందుకు చెయ్యడం లేదు.  తప్పంతా వారి దగ్గర పెట్టుకొని.. మీడియా ముందు మాత్రం ఏమీ ఎరగనట్టు సన్నాయి నొక్కులు నొక్కడం ఎందుకు? అనే విమర్శలు వినపడుతున్నాయి.

సరే.. ఇవన్నీ కాదు.. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హా జరుకావాలని కోరుకునే వారే అయితే.. సీఎం చంద్రబాబుతో ఈ విషయంపై మాట్లాడి..ఇదే విషయం వైసీపీ కి చెబితే సరిపోతుంది కదా. సీఎం, స్పీకర్ అడిగితే.. వైసీపీ నేతలు మాత్రం ఎందుకు కాదంటారు? మరి ఆ పని ఎందుకు చెయ్యడం లేదు. ఎందుకంటే.. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఉండటమే వారికి కావాల్సింది. కానీ.. బయటకు మాత్రం ఇలాంటి మాటలు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu