
‘అహింసా ఉద్యమంతో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి కోట్లాదిమంది భారతీయుల హృదయాలలో జాతిపితగా పదిలమై ఉన్న మహాత్మా గాంధీ’ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘బనియా’ అని తూలనాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
వెంటనే ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో అమిత్ షాను అడుగుపెట్టనివ్వబోమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ హెచ్చరించింది. నేర చరిత్ర గల అమిత్షాకు గాంధీజి పేరును స్ఫురించే అర్హత కూడా లేదని అంటూ గాంధీజీ బొమ్మ పెట్టుకుని స్వచ్ఛభారత్ అంటూ ప్రకటనలు గుప్పించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారు? మీ గాంధీ మార్గం ఇదేనా? అని ఎపిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలని ఆయన డిమాాండ్ చేశారు.