
మన దేశంలో ప్రజలు.. ఎంత మంది దేవుళ్లకు పూజలు చేస్తారో.. అంతకన్నా ఎక్కువ మంది బాబాలను పూజిస్తారు. వారి వాక్కే వేదంగా భావిస్తారు. ఆ బాబాల కోసం ప్రాణాలు తీసేందుకు గానీ.. తీయడానికి గానీ వెనకాడరు. ఇందుకు డేరా బాబా నే నిదర్శణం. కేవలం ఒక్క డేరా బాబా నే కాదు.. చాలా మంది బాబాల ముసుగులో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
ముఖ్యంగా ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా కంపెనీ.. తమ ప్రాడెక్టును మార్కెట్ లోకి విడుదల చేస్తే.. దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎడ్వర్టైజ్ మెంట్లు ఇస్తుంది. దీంతో దాని గురించి ప్రజలు తెలుసుకొని కొనుగోళ్లు చేపడతారు. సరిగ్గా ఇదే ఫార్ములాని బాబాలు ఉపయోగిస్తున్నారు.
‘మీ దాంపత్యంలో ఏవైనా సమస్యలా..? ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. వ్యాపారంలో నష్టాలా.. వీటన్నింటికీ సంప్రదించండి.. **** బాబాని. ఆయన మీమ్మల్ని బాధల నుంచి విముక్తి చేస్తారు.’ ఇలాంటి వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను బస్సులలో, రైళ్లల్లో.. పలు పబ్లిక్ ప్రాంతాలలో అంటిస్తున్నారు. నిజంగా అందులో చెప్పిన సమస్యలతో బాధపడుతున్న వారు వాటికి ఆకర్షితులౌతున్నారు. నిజమేనేమో.. ప్రయత్నిస్తే తప్పు లేదు కదా.. అని ఆ బాబా దగ్గరకు వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.
అంతేకాదు.. కొందరు బాబాలు.. ఆ పోస్టర్లను చేత పట్టుకొని బస్సులో దూరుతున్నారు. అలాంటి వారిని బస్సుల్లో ఎక్కించుకోవద్దని పోలీసులు చెబుతున్నారా.. వారి తీరులో మార్పు లేదు.
కొందరు బాబాలు.. నగదు లక్షంగా ఇలాంటి మోసాలు చేస్తుంటే.. మరి కొందరు ఆధ్యాత్మికం ముసుగులో మహిళలపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో గత మూడేళ్లలో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిని దాదాపు 30మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. పైగా కొత్త బాబాలు పుట్టుకువస్తున్నారు.