
Karnataka hijab row: కర్ణాటకలోని ఉడుపి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల మధ్య తల్లెత్తిన హిజాబ్ వివాదం ఇప్పుడూ చిలికి చిలికి గాలి వానగా మారింది. దేశ సరిహద్దులు దాటి.. అంతర్జాతీయ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఇప్పుడూ యావత్ సమాజాన్ని అట్టుడికిస్తోంది. ఓ వైపు హిజాబ్ అనుకూల, మరోవైపు ప్రతికూల ఆందోళనలు జరగడంతో హిజాబ్ ఆంశం మరింత వివాదస్పదంగా మారుతోంది. దీంతో వివాదం ఓ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుందే తప్ప, షరియత్/ఇస్లామిక్ చట్టం ప్రకారం నడుచుకోదు అని స్పష్టం చేశారు.
ముస్లిం మహిళల హక్కులను కాపాడాలని, వారిని గౌరవమిస్తూ ప్రధానమంత్రి మోదీ ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేశారని యోగి పేర్కొన్నారు. వ్యక్తిగత మతాచారాలను, మతపరమైన నిర్ణయాలను దేశంపైనా, దేశ వ్యవస్థలపైనా రుద్దడం సరికాదని యోగి అభిప్రాయపడ్డారు. అలాగే.. దేశంలో ఏదోక రోజు హిజాబ్ ధరించిన మహిళే ప్రధాని అవుతుందని AIMIM అధినేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందించారు. తమ వ్యక్తిగత మత విశ్వాసాలను దేశంలో విధించలేమని, ఉత్తరప్రదేశ్లోని ఉద్యోగులందరూ కాషాయ కండువా ధరించమని ఆదేశించగలనా? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం సూచించారు. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తున్నప్పుడు, మహిళలకు తగిన గౌరవం, భద్రత, స్వాతంత్య్రం లభిస్తాయని ఆయన అన్నారు.
మనది నవ భారతం, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని తను చాలా స్పష్టంగా చెప్పగలననీ అన్నారు. ఈ నవ భారతదేశం అభివృద్ధిపథంలో నడుస్తోందని అన్నారు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇది సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సూత్రంతో పనిచేస్తుంది. షరియత్ ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారమే పని చేస్తుందని, ప్రధాని మోదీ హయాంలో ఘజ్వా-ఏ-హింద్ కల సాకారం కాదని, గజ్వా-ఏ-హింద్ కావాలని కలలు కనేవాళ్లు, తాలిబానీ మత ఛాందసవాదులు దీన్ని అర్థం చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కర్నాటక హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హిజాబ్ కేసు విచారణను పునఃప్రారంభించనుంది. ఈ కేసును అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు గతంలో నిరాకరించింది, ముందుగా ఈ కేసును హైకోర్టు విచారించాలని పేర్కొంది.