పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేసిన రెజ్లర్ భజరంగ్ పూనియా.. కారణం చెబుతూ ప్రధానికి సుధీర్ఘ లేఖ

Published : Dec 22, 2023, 05:57 PM IST
 పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేసిన రెజ్లర్ భజరంగ్ పూనియా.. కారణం చెబుతూ ప్రధానికి సుధీర్ఘ లేఖ

సారాంశం

భారత రెజ్లర్ భజరంగ్ పూనియా (Wrestler Bajrang Punia) తన పద్మశ్రీ (Padma Shri) అవార్డును తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ (Prime minister narendra modi)కి సుధీర్ఘ లేఖ రాశారు. దానిని ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు.

Bajrang Punia : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ గా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ను నియమించడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో రెజ్లర్ సాక్షి మాలిక్ కన్నీటి పర్యంతమవుతూ, తన పదవీ విరమణ చేసిన మరుసటి రోజే భజరంగ్ పూనియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దానిని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ‘‘నా పద్మశ్రీ అవార్డును ప్రధానికి తిరిగి ఇస్తున్నాను. ఈ చర్యకు సంబంధించి ఈ ట్వీట్ నా అధికారిక ప్రకటనగా పనిచేస్తుంది.’’ అని ఆయన పేర్కొన్నారు. 

కాగా.. డిసెంబర్ 21వ తేదీన న్యూఢిల్లీలో డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు జరిగాయి. ఇందులో సంజయ్ సింగ్ మాజీ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అనితా షియోరాన్ పై 40-7 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సంజయ్ సింగ్ ఎన్నిక అనంతరం సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ‘‘ఇప్పుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. మహిళా రెజ్లర్లు వేధింపులను ఎదుర్కొంటూనే ఉంటారు’’ అని ఫోగట్ కన్నీటి పర్యమంతమయ్యారు. కానీ మలిక్ తాను క్రీడ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.

తాగాజా భజరంగ్ పూనియా తన పద్మ శ్రీ అవార్డును తిరిగిచ్చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రధానికి రాసిన లేఖలో ఏముందంటే ‘‘ప్రియమైన ప్రధానిగారూ, మీ ఆరోగ్యం బాగుందని ఆశిస్తున్నాను. మీరు చాలా పనుల్లో బిజీగా ఉంటారు కానీ దేశంలోని రెజ్లర్లకు ఏం జరుగుతుందో మీ దృష్టికి తీసుకురావడానికి నేను దీనిని రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో దేశంలోని మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నేను కూడా వారి నిరసనలో పాల్గొన్నాను. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన విరమించాం’’ అని పునియా లేఖలో పేర్కొన్నారు.

‘‘కానీ మూడు నెలలు గడిచినా బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుకే ఢిల్లీ పోలీసులు కనీసం అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేము ఏప్రిల్ లో మళ్లీ వీధుల్లోకి వచ్చాము. జనవరిలో 19 మంది ఫిర్యాదు చేయగా, ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య 7కు పడిపోయింది. అంటే బ్రిజ్ భూషణ్ తన పలుకుబడిని ఉపయోగించి మిగతా 12 మంది రెజ్లర్లను తమ నిరసనలను విరమించుకునేలా చేశారు.’’ అని తెలిపారు. 

‘‘ మా ఉద్యమం 40 రోజుల పాటు కొనసాగింది. ఈ 40 రోజుల్లో ఓ మహిళా రెజ్లర్ మరింత వెనక్కి తగ్గారు. మా అందరిపైనా చాలా ఒత్తిడి ఉండేది. మా నిరసన వేదిక ధ్వంసం చేశారు. మమ్మల్ని ఢిల్లీ నుండి తరిమికొట్టారు. మా నిరసనను నిషేధించారు. ఇలా జరిగినప్పుడు మాకు ఏం చేయాలో తోచలేదు. అందుకే గంగా నదిలో పతకాలు పారేయాలని నిర్ణయించుకున్నాం. కానీ మేము అక్కడికి వెళ్లినప్పుడు మా కోచ్ సాహిబాన్, రైతులు మమ్మల్ని అనుమతించలేదు. అదే సమయంలో మీ బాధ్యతగల మంత్రి నుండి మాకు ఒక కాల్ వచ్చింది. మీరు తిరిగి రండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ’’ అని పూనియా పేర్కొన్నారు. 

‘‘ఈ లోపు మేము మా హోం మంత్రిని కూడా కలిశాము. ఆయన మహిళా రెజ్లర్లకు న్యాయం చేయడంలో తన మద్దతు ఇస్తానని తెలిపారు. అలాగే బ్రిజ్ భూషణ్, అతడి కుటుంబం, అతడి అనుచరులను రెజ్లింగ్ ఫెడరేషన్ నుండి బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేము అతడి సూచనను అంగీకరించాం. మా నిరసనను ముగించాం. ఎందుకంటే ప్రభుత్వం మా రెజ్లర్ యూనియన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే న్యాయస్థానంలో న్యాయ పోరాటం జరుగుతుందని మాకు అనిపించింది.’’ అని పేర్కొన్నారు. 

‘‘అయితే డిసెంబర్ 21న జరిగిన రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ మరోసారి విజయం సాధించారు. ఈ మానసిక ఒత్తిడిలో ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. రాత్రంతా ఏడుస్తూ గడిపాము. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో, ఎలా జీవించాలో అర్థం కాలేదు. ప్రభుత్వం, ప్రజలు మాకు ఎంతో గౌరవం ఇచ్చారు. ఈ గౌరవ భారంతో నేను ఊపిరాడకుండా ఉండాలా? 2019లో నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఖేల్ రత్న, అర్జున్ అవార్డులతో సత్కరించారు. కానీ తమ మల్లయోధులకు అవమానం జరిగింది. అందుకే నేను నా పద్మ శ్రీ ని తిరిగి ఇచ్చేస్తున్నాను’’ అంటూ భజరంగ్ పూనియా సుధీర్ఘ లేఖ రాశారు. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu