
పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఓ కార్మికుడు 70 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం .. శనివారం సాయంత్రం కర్తార్పూర్ కారిడార్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్ అనే కార్మికుడు మరో వర్కర్తో కలిసి బోరింగ్ మెషిన్లోని కొంత భాగాన్ని విడిపించేందుకు బావిలో వున్నాడు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా పట్టు తప్పి కిందకు జారింది.
ఇద్దరిలో ఒకరు ఎలాగోలా పైకి వచ్చేయగా.. సురేష్పై భారీ మొత్తంలో ఇసుక పడటంతో అతను లోపల ఇరుక్కుపోయాడు. జిల్లా యంత్రాంగం , జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఢిల్లీ - కత్రా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్లో భాగంగా పిల్లర్ను ఏర్పాటు చేసేందుకు ఈ బోర్వెల్ను తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.