
బెంగళూరు: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో 21 ఏళ్ల యువతిని, ఆమె ప్రేమికుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు యలహంకకు చెందిన శ్వేత, ఆమె స్నేహితుడు ఏపీలోని పెనుకొండకు చెందిన సురేష్ అలియాస్ మూలి సూరి (25). వీరిద్దరూ కలిసి అక్టోబరు 21న శ్వేత భర్తను హత్య చేశారు. వీరిద్దరూ పెనుకొండకు చెందినవారే కావడంతో శ్వేత, సూరితో ప్రేమలో పడిందని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి వీరింట్లో తెలిసింది.
కానీ ఆమె తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. 2019లో ఆమెకు బలవంతంగా మేనమామ చంద్రశేఖర్తో పెళ్లి చేశారు. కానీ శ్వేత పెళ్లైనా ప్రేమను మరిచిపోలేదు. తన ప్రేమికుడు సురేష్ తో తన అనుబంధాన్ని కొనసాగించింది. ఇది భర్తకు తెలియడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. దీంతో శ్వేత తండ్రి శివప్ప ఆరు నెలల క్రితం యలహంకకు వచ్చాడు. కూతురు, అల్లుడు చంద్రశేఖర్ను తనవెంట ఊరికి తీసుకువెళ్లాడు. అయితే శ్వేత, సూరి తమ సంబంధాన్ని కొనసాగించాలంటే చంద్రశేఖర్ను హత్య చేయాలని పథకం పన్నారని పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే సూరి కూడా యలహంక వచ్చాడు.
దారుణం.. టీ తాగి ఐదుగురి మృతి.. చాయ్ పత్తా అనుకుని అది కలపడం వల్లే...
అక్టోబర్ 21వ తేదీ రాత్రి శ్వేతతో కలిసి ఆమె ఇంటి టెర్రస్పై కత్తి, ఇనుప రాడ్ లతో చంద్రశేఖర్పై దాడి చేశారు. తలపై కొట్టి కత్తితో పొడిచి చంపారు. సూరి అక్కడి నుంచి పారిపోగా, శ్వేత ఏమీ ఎరగనట్టు సహాయం కోసం కేకలు వేసింది. ఆమె తండ్రి డాబా మీదకు వెళ్లి చూడగా చంద్రశేఖర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
శివప్ప ఫిర్యాదు మేరకు యలహంక పోలీసులు హత్య కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ బాలాజీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. సూరితో శ్వేతకు ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారణకు తీసుకువెళ్లగా ఆమె నేరం అంగీకరించినట్లు తెలిసింది.