కోర్టు ఆవరణలోని తన గదిలోనే మహిళా న్యాయవాదిపై సీనియర్ న్యాయవాది అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.
న్యూఢిల్లీ : కోర్టు ఆవరణలోని తన గదిలోనే మహిళా న్యాయవాదిపై సీనియర్ న్యాయవాది అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సాకేత్ కోర్టులోని తన చాంబర్లో శనివారం రాత్రి సీనియర్ న్యాయవాది అదే కోర్టులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారని డీసీపీ రొమిల్ బనియా తెలిపారు.
లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు వచ్చిన న్యాయవాది చాంబర్ను సీల్ చేశామని, ఫోరెన్సిక్ లేబొరేటరీ, క్రైమ్ టీమ్ దాన్ని పరిశీలించారని చెప్పారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని ఆమెను వైద్యపరీక్షలకు పంపించినట్లు తెలిపారు.
ఆ సమయంలో సీనియర్ న్యాయవాది తాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంఘటన జులై 14,15 తేదీల మధ్యరాత్రి జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సాకేత్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.