లైంగిక వేధింపులు.. తండ్రిని హతమార్చిన కుమార్తె..!

By telugu news teamFirst Published Sep 27, 2021, 9:42 AM IST
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు కోసం వచ్చిన వెంకటేష్ తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కిరాతకంగా ప్రవర్తించాడు. కూతురిపై శారీరక వాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. అయితే.. తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని ఆ కూతురు తట్టుకోలేకపోయింది. అపరకాలిలా మారి.. తండ్రిని హతమార్చింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్ పురాయూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ దివ్యాంగుడు. భార్య మరణం తర్వాత ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. వెంకటేష్ పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా... చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు కోసం వచ్చిన వెంకటేష్ తన ఇంట్లో విగతజీవిగా పడి ఉన్నాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం పై కత్తిపోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు. అయితే.. దర్యాప్తులో రెండో కుమార్తె హత్య చేసినట్లు తేలింది.

తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని.. ఆత్మరక్షణ కోసమే చంపేశానని ఆ బాలిక చెప్పడం గమనార్హం. పోలీసులు బాలికను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మ రక్షణ కోసమే తండ్రి ని చంపిన బాలికను వెంటనే విడుదల చేయాలని విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు. 

click me!