
చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేస్తున్న 29 ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు, ముగ్గురు వ్యక్తులు కలిసి పుదుకోట్టైలో హత్య చేశారు. అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి, 400 కిలోమీటర్లు దూరం తీసుకువెళ్ళి... కోవలం వద్ద ఇసుకలో పాతిపెట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో భాగ్యలక్ష్మి (38) అనే మహిళను అదుపులోకి తీసుకుని, పురుషుల కోసం గాలిస్తున్నారు.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్ ఎయిర్వేస్లో గ్రౌండ్ స్టాఫ్గా ఉన్న ఎం జయంతన్ మార్చి 18న తమ స్వస్థలమైన విల్లుపురం వెళ్తున్నట్లు తన సోదరికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే, అతను అక్కడికి చేరుకోకపోవడంతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉంది. అతని సోదరి, మద్రాస్ హైకోర్టులో న్యాయవాది పి. జయకృబా (41) మార్చి 21న పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు అధికారులు జయంతన్ కాల్ రికార్డులను పరిశీలించారు. పుదుకోట్టైలో అతని చివరి కాల్ గుర్తించారు. కాల్ రికార్డుల ఆధారంగా వారు భాగ్యలక్ష్మిని జీరో చేశారు. భాగ్యలక్ష్మి అనే మహిళ సెక్స్ వర్కర్ అని, 2020 మేలో తాంబరంలోని లాడ్జిలో మొదటిసారిగా జయంతన్ ఆమెను కలిశాడని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడిందని, ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా విల్లుపురం సమీపంలోని మైలంలో ఉన్న ఆలయంలో జయంతన్ ఆమెకు 'తాళి' కట్టాడని.. పోలీసులు తెలిపారు. ఆ తరువాత 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారని పోలీసులు తెలిపారు.
హత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు, అయితే జయంతన్ భాగ్యలక్ష్మికి చాలా డబ్బు ఇచ్చాడనే వాస్తవం వెలుగు చూసింది. దీంతో డబ్బుల కోసమే ఇది జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. హంతకులు మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇంత దూరం ఎందుకు తరలించారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
భాగ్యలక్ష్మిని విచారించిన తర్వాత, ఆమె పుదుక్కోట్టైలోని తన ఇంటికి జయంతన్ను పిలిపించి వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తన స్నేహితుడు శంకర్కి ఫోన్ చేసింది. అతను మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చాడు. భాగ్యలక్ష్మి, ఆమె స్నేహితులు కలిసి జయంతన్ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తరువాత జయంతన్ కాళ్లు , చేతులను ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టారు. మార్చి 20వ తేదీన ఈ ముఠా జయంతన్ శరీరభాగాలను చెన్నై సమీపంలోని కోవలంకు తీసుకొచ్చింది. ప్లాస్టిక్ కవర్లో చుట్టిన శరీర భాగాలను నిర్జన ప్రదేశంలో పాతిపెట్టి, పుదుకోట్టైకి తిరిగి వెళ్లారు.
మార్చి 26 ఉదయం, భాగ్యలక్ష్మి ఒక క్యాబ్ అద్దెకు తీసుకుని, మిగిలిన శరీర భాగాలతో మళ్లీ చెన్నైకి వెళ్లింది. వాటిని కూడా కోవలంలో పాతిపెట్టింది. ఈ సమయంలో ఆలయ పూజారి ఆమెకు సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.
విషయాలు వెలుగులోకి రావడంతో కోవలం వద్ద మృతదేహాలను వెలికి తీయాలని పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అయితే, హత్యకు సంబంధించి నిందితులు పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారని విచారణ అధికారి తెలిపారు. "ముఠా సభ్యులు పుదుకోట్టై నుండి కోవలం వరకు శరీర భాగాలను ఎందుకు తీసుకువచ్చారు. లేదా అదే స్థలంలో పారవేసేందుకు వారు వారం గ్యాప్ ఎందుకు తీసుకున్నారు. మళ్లీ అదే ప్రాంతంలో ఎందుకు పారేశారు..’ అనే అనుమానాలున్నాయన్నారు.