
తమిళనాడు : చెన్నైలోని స్థానిక సైదాపేట రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారం చేసే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం. అయితే ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమా అనే అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో జరిగింది.
స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. రాజేశ్వరి, ఆమె భర్త భువనేశ్వర్ మీనంబాక్కం ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం రాజేశ్వరి రోజూ రైల్వే స్టేషన్లలో పండ్లు, సమోసాలు అమ్ముతుండేది. బుధవారంనాడు కూడా కూడా రోజులాగే వ్యాపారాన్ని ముగించుకొని సాయంత్రానికి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లడం కోసం సైదాపేట రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది.
బాబోయ్.. అల్లుళ్లకు వరకట్నంగా 21 పాములు.. ఎక్కడంటే...
ఆ సమయంలో వచ్చిన ఓ రైలు నుండి నలుగురు దుండగులు దిగారు. వారు వెంటనే ఆమెపై దాడి చేసి క్షణాల్లో అదే రైలులో పరారయ్యారు. వారి దాడిలో ఒంటి నిండా కత్తిపోట్లతో రక్తసిక్తమైన రాజేశ్వరి ప్లాట్ఫారం మీదనే కుప్పకూలిపోయింది. కళ్ళముందే క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనను చూసిన రైల్వేస్టేషన్లోని మిగతా ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న మాంబళం రైల్వే పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న రాజేశ్వరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు రాజేశ్వరికి పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
అయితే ఈ సైదాపేట రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు లేవు. దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. కాకపోతే రాజేశ్వరి సెల్ఫోన్లో ఉన్న వివరాల ప్రకారం.. హంతకులను గుర్తిస్తామని, తొందర్లోనే నిందితులను అరెస్టు చేస్తామని రైల్వే పోలీసులు అంటున్నారు.