
న్యూఢిల్లీ: మళ్లీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా సంచలన ప్రకటన చేశారు. ఒమిక్రాన్ బీఏ-5 సబ్ వేరియంట్ టీకా మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ఇదే రోజు యూకేలో కొత్త వర్షన్ మొడెర్నా టీకాకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వర్షన్ ఒమిక్రాన్ స్పెసిఫిక్గా అప్డేట్ చేశారు. అంటే.. ఈ టీకా ఒరిజిన్ రూపంతోపాటు ఒమిక్రాన్ వేరియంట్లకూ విరుగుడుగా పని చేస్తుంది.
సీరం ఇన్స్టిట్యూట్ నోవావాక్స్తో సంయుక్తంగా ఈ ఒమిక్రాన్ స్పెసిఫిక్ టీకాను అభివృద్ధి చేస్తున్నట్టు అదర్ పూనావాలా తెలిపారు. ఈ వ్యాక్సిన్ను ఒక ముఖ్యమైన బూస్టర్గా పరిగణించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ కేంద్రంగా పని చేసే బూస్టర్ వ్యాక్సిన్లు ఇప్పుడు భారత దేశానికి అవసరం అని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ మైల్డ్గా ఏమీ లేదని, అది ఇప్పుడు సీరియస్ ఫ్లూగా కనిపిస్తున్నదని వివరించారు.
నోవావాక్స్ ట్రయల్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నవంబర్ డిసెంబర్ కల్లా ఈ టీకా కోసం యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ను అప్రోచ్ అవుతారని వివరించారు. అయితే, ఈ టీకాకు మన దేశంలోనూ ట్రయల్స్ అవసరమా? లేదా? అనే విషయం పై క్లారిటీ లేదు.
అయితే, ఆరు నెలల్లో ఈ టీకా అభివృద్ధి చెందినా.. దానికి భారత రెగ్యులేటరీ అనుమతి అవసరం ఉంటుంది. డీజీసీఏ అనుమతుల తర్వాతే భారత్లో ఆ టీకా పంపిణీ సాధ్యం అవుతుంది.