వీడియో కాల్ లో డాక్టర్ సూచనలతో.. మహిళకు ప్రసవం చేసిన నర్సులు.. మృతశిశువు జననం...

By SumaBala BukkaFirst Published Sep 21, 2022, 12:11 PM IST
Highlights

వీడియో కాల్ లో డాక్టర్ సూచనలిస్తుంటూ ముగ్గురు నర్సులు ఓ గర్భిణికి ప్రసవం చేశారు. కానీ ఆ సమయంలో తలెత్తిన సమస్యలతో మృతశిశువు జన్మించింది. దీంతో ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. 

తమిళనాడు : చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు ముగ్గురు నర్సులు వీడియో కాల్ ద్వారా డాక్టర్ చేసిన సూచనల ప్రకారం ప్రసవం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. నర్సులు అరకొరగా ప్రసవం చేయడంతో ఆ మహిళకు మృత శిశువు జన్మించింది.  ఈ సంఘటనకు నిరసనగా  మహిళ కుటుంబీకులు,  స్థానికులు ధర్నా, రాస్తారోకోకు దిగారు. ఇల్లీడు ప్రభుత్వ ఆస్పత్రికి కొద్ది రోజుల క్రితం పుష్ప అనే గర్భిణీ వైద్య పరీక్షలకు వెళ్ళింది. ఆమెకు ఇంకా ప్రసవానికి సమయం ఉండడంతో పరీక్షలు చేసి పంపించివేశారు.

ఆమెకు  పురిటినొప్పులు రాకపోవడంతో నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి రమ్మన్నారు. దీంతో ఇంటికి తిరిగి వెళ్లిన ఆమెకు ఈ సోమవారం నొప్పులు వచ్చాయి. నొప్పులు అధికం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.  ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరు. ముగ్గురు మాత్రమే డ్యూటీలో ఉన్నారు.  పురిటి నొప్పులతో బాధపడుతున్న పుష్పకు తామే పురుడు పోయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ కు ఫోన్ చేసి విషయం తెలిపారు. 

సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు.. పెళ్లి ప్రకటన వైరల్... మేమేం పాపం చేశాం అంటున్న టెకీలు...

దీంతో ఆ డాక్టర్ వీడియో కాల్ చేసి ప్రసవం ఎలా చేయాలో వివరిస్తుండగా ముగ్గురు కలిసి పుష్పకు ప్రసవం చేస్తుండగా..  గర్భంలోని శిశువు అడ్డం తిరిగింది. శిశువు కాళ్లు మాత్రమే వెలుపలికి వచ్చాయి. ఆ తర్వాత ఏం చేయాలో తోచక నర్సులు ఇబ్బంది పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న  డాక్టర్ సలహా మేరకు ఆమెను మధురాంతకం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. మార్గమధ్యంలోనే అంబులెన్స్ లో పుష్పకు మృత శిశువు జన్మించింది. 

ఈ విషయం తెలుసుకుని ఆగ్రహం చెందిన ఆమె కుటుంబీకులు, స్థానిక ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న పుష్పను కాపాడేందుకు రాకుండా.. వీడియో కాల్ ద్వారా నర్సులకు సూచనలిచ్చి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వీరి ధర్నా కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

click me!