పేరు మార్చేదిలేదు, ముంబైని వదిలేది లేదు: కరాచీ బేకరీ యాజమాన్యం స్పందన

By Siva KodatiFirst Published Mar 7, 2021, 9:17 PM IST
Highlights

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరాచీ బేకరీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ప్రముఖ నగరం కరాచీ పేరు దీనికి పెట్టడమే ఇందుకు కారణం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరాచీ బేకరీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ప్రముఖ నగరం కరాచీ పేరు దీనికి పెట్టడమే ఇందుకు కారణం. ముంబైలోని ఓ చోట కరాచీ బేకరీ మూతపడటంతో దేశంలోని మిగిలిన నగరాల్లో వున్న ఔట్‌లెట్లను కూడా మూసివేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ ఊపందుకుంది. దీనిపై కరాచీ బేకరీ యాజమాన్యం స్పందించింది.

తమ బేకరీ పేరు మార్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ముంబయిలో కరాచీ బేకరీ అవుట్ లెట్ మూసేయడానికి కారణం పేరుపై నెలకొన్న వివాదం కాదని, ఆ భవనం యజమానితో కుదుర్చుకున్న లీజు అగ్రిమెంట్ వ్యవహారమే కారణమని వెల్లడించింది.

ఇదే సమయంలో ముంబయిలో అద్దెలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వివరించింది. కరాచీ బేకరీ పేరు మార్చడం కానీ, ముంబయిలో తమ బ్రాంచ్ ఎత్తివేయడం కానీ చేయబోమని యాజమాన్యంలో ఒకరైన రాజేశ్ రమ్నాని తేల్చిచెప్పారు

ముంబయిలో మరో ప్రాంతంలో తమ బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తమ బేకరీ పేరు వివాదంలో చిక్కుకోవడం బాధాకరమని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో తాము కొంత ఆందోళనకు గురయ్యామని, అయితే బేకరీ ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఎంఎన్ఎస్ పార్టీ నేత హాజీ సైఫ్ షేక్ ఇటీవల చేసిన ట్వీట్ మరోలా ఉంది. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టినందువల్ల ఎట్టకేలకు ఆ బేకరీ మూతపడిందని ఆయన చెప్పుకున్నారు.

కరాచీ బేకరీ యాజమాన్యానికి తాము లీగల్ నోటీసులు కూడా పంపామని, కరాచీ అనే పదం భారతీయులు, భారత సైన్యం మనోభావాలకు వ్యతిరేకమని హాజీ షేక్ వివరించారు. ఈ నేపథ్యంలో కరాచీ బేకరీ యాజమాన్యం స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

click me!