2024 ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

Published : Feb 10, 2024, 03:34 PM IST
2024 ఎన్నికలకు ముందే సీఏఏ అమలు : అమిత్ షా

సారాంశం

పౌరసత్వ చట్టం (సిఎఎ) పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి తిరిగి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడిందని.. దీనివల్ల ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదని అమిత్ షా అన్నారు.

న్యూఢిల్లీ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ లేదని, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కూడా తాము మళ్లీ ప్రతిపక్ష బెంచ్‌లలో కూర్చోవాల్సి వస్తుందని గ్రహించాయని అమిత్ షా నొక్కి చెప్పారు.

“మేం ఆర్టికల్ 370 (రాజ్యాంగంలోని పూర్వపు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన) రద్దు చేశాం, కాబట్టి దేశ ప్రజలు బిజెపికి 370 సీట్లు, ఎన్‌డిఎకు 400 సీట్లతో ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం అని ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024లో షా అన్నారు.

జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి), మరికొన్ని ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగినప్పుడు, హోం మంత్రి సమాధానం చెబుతూ..  "భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి కుటుంబ నియంత్రణపై నమ్మకం ఉంది. కానీ, అది రాజకీయాల్లో కాదు" రాజకీయపార్టీ అనే కుటుంబాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ క్రమంలో మరిన్ని పార్టీలు పాలక కూటమిలో చేరవచ్చని తెలిపారు. 

పొత్తులపై మాట్లాడుతూ.. "ఆయా పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి కానీ ఏదీ ఖరారు కాలేదు" అన్నారు. 2024 ఎన్నికలు ఎన్‌డిఎ, భారత ప్రతిపక్ష కూటమికి మధ్య జరిగే ఎన్నికలు కాదని, అభివృద్ధికి, కేవలం నినాదాలు ఇచ్చేవారికి మధ్య జరిగే ఎన్నికలు అని షా అన్నారు.

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర గురించి ప్రశ్నించగా, 1947లో దేశ విభజనకు ఆ పార్టీయే కారణమని, నెహ్రూ-గాంధీ వంశానికి ఇలాంటి పాదయాత్రలు చేసే హక్కు లేదన్నారు. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) అధికారం కోల్పోయినప్పుడు ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పాటు చేసిందో.. తెలుసుకోవడానికి దేశానికి పూర్తి హక్కు ఉందని భావించే.. ప్రభుత్వం పార్లమెంటులో శ్వేతపత్రం ప్రవేశపెట్టిందని అన్నారు. 

జేసీబీకి పరీక్షే.. బురద గుంటలో ఇరుక్కపోయిన నాగాలాండ్ బీజేపీ మంత్రి.. వీడియో వైరల్..

పదేళ్ళ తరువాత శ్వేత పత్రం ప్రవేశపెట్టడం మీద మాట్లాడుతూ.. ‘‘2014లో ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది.. ఎక్కడ చూసినా మోసాలు.. విదేశీ పెట్టుబడులు రావడం లేదు.. ఆ సమయంలో శ్వేతపత్రం ప్రవేశపెడితే.. ప్రపంచానికి మనదేశం గురించి తప్పుడు సందేశం వెళ్లేది. అయితే, 10 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించిందని, విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చిందని, అవినీతికి తావులేదని.. అందుకే శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన అన్నారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణంకోసం దేశ ప్రజలు 500-550 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని హోంమంత్రి అన్నారు. అయితే బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతలను ఉటంకిస్తూ రామమందిర నిర్మాణానికి అనుమతి లభించలేదన్నారు. 

పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ)పై, 2019లో రూపొందించిన చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత.. అమలు చేస్తామని చెప్పారు.
"మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సిఎఎకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. సిఎఎ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు,ః" అన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై, దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇతరులు సంతకం చేసిన రాజ్యాంగ ఎజెండా అని షా అన్నారు. "కానీ కాంగ్రెస్ బుజ్జగింపు కారణంగా దానిని విస్మరించింది. ఉత్తరాఖండ్‌లో UCC అమలు ఒక సామాజిక మార్పు. ఇది అన్ని ఫోరమ్‌లలో చర్చించబడుతుంది. చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటుంది. లౌకిక దేశంలో మతం ఆధారిత సివిల్ కోడ్‌లు ఉండకూడదు" అని ఆయన అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?