
తమిళనాడు : కుటుంబకలహాల నేపథ్యంలో 36 ఏళ్ల మహిళ మద్యం మత్తులో ఉన్న భర్త పై దోసెల పెనంతో దాడి చేసి హత్య చేసింది. బుధవారం పోలీసులకు పోస్టుమార్టం నివేదిక అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్ నగరంలోని సెంథిల్ నగర్కు చెందిన రవికుమార్ (42), జ్యోతిమణి భార్యాభర్తలు. భర్త మద్యానికి బానిస కావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
మార్చి 22న కూడా రవికుమార్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ తరువాత భార్య జ్యోతిమణిపై దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో తట్టుకోలేని జ్యోతిమణి కోపంతో, విసిగిపోయి రవికుమార్ను దోసెల పాన్ తో కొట్టింది. రవికుమార్ స్పృహతప్పి పడి చనిపోయాడు. ఆ తరువాత జ్యోతిమణి.. భర్త మృతదేహాన్ని అంబులెన్స్లో ఈరోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. భర్తకు గుండెపోటు వచ్చినట్లు చెప్పింది.
అందరికీ అదే విషయాన్ని చెప్పింది. మార్చి 23న, బంధువులు అతడి అంత్యక్రియలు నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే, మృతుడి తండ్రికి అనుమానం వచ్చింది. కొడుకుది సహజ మరణం కాదని.. తిరుమురుగన్పూండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
వివాహేతర సంబంధం : నాలుగు నెలల గర్భిణిని రోకలి బండతో కొట్టి చంపి.. భర్త పరార్...
శరీరమంతా మొద్దుబారిన గాయాల వల్లే అతను మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దీంతో పోలీసులు జ్యోతిమణి మీద అనుమానంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె రవికుమార్ను హత్య చేసినట్లు అంగీకరించారు. బుధవారం ఆమెను అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలులో ఉంచారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే జనవరిలో తెలంగాణలో వెలుగు చూసింది. భర్త ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ భార్య దారుణానికి తెగించింది. ఏకంగా అతడిని హతమార్చింది. ప్రమాదవశాత్తు మరణించాడని కథ అల్లింది. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని ఆశపడి ఈ పని చేసిందని పోలీసుల విచారణలో తేలడంతో అరెస్ట్ అయి జైలు పాలయింది. భర్త నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని.. అందుకే అతడిని హతమార్చినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెంలోని గాంధీ కాలనీలో కొమ్మర బోయిన శ్రీనివాస్ (50), భార్య సీతామహాలక్ష్మి (43)తో కలిసి ఉంటున్నాడు. కొత్తగూడెం కలెక్టరేట్ లో అటెండర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నాడు. డిసెంబర్ 30 ఉదయం తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాస్ ను కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రిలో సీతా మహాలక్ష్మి జాయిన్ చేసింది. డిసెంబర్ 29న అర్థరాత్రి శ్రీనివాస్ వంటింట్లో కాలు జారిపడ్డాడని..దీంతో తలకు తీవ్ర గాయమైంది అని చెప్పింది. జిల్లా ఆస్పత్రిలో వైద్యులు వెంటనే అతనికి చికిత్స అందించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ రెండు, మూడు గంటల్లోనే శ్రీనివాస్ మరణించాడు.
అయితే వీరికి సాయికుమార్ అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి మృతిపై అతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మేరకు తనకు తండ్రి మరణం మీద అనుమానం ఉంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత.. భార్య సీతామహాలక్ష్మి కనిపించకుండాపోయింది. దీంతో అనుమానం పై ఆమెపై నిఘా పెట్టారు. ఆ తరువాతి రోజు రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
‘ఆ రోజు నా భర్త బాగా తాగి వచ్చాడు. వేధించాడు. అందుకే అతను నిద్రలోకి జారుకోగానే.. కర్రతో తలమీద కొట్టాను. బాగా దెబ్బ తగిలింది. ఆ తరువాత వంటింట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాను.. కాలుజారి వంటింట్లో పడిపోయాడని చెప్పాను’ అని నిందితురాలు అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.