
సభా ప్రాంగణాన్ని ప్రదర్శనకు లేదా ధర్నాకు ఉపయోగించరాదని పార్లమెంటు సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై టీఎంటీ ఎంపీ మహువా మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గాంధీ విగ్రహాన్ని కూడా సభా ప్రాంగణం నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాన్ని సందించారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ని కూడా తొలగించాలని సూచించారు.
ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో శుక్రవారం ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ ఆవరణలో గాంధీజీ విగ్రహాన్ని ఎందుకు తొలగించకూడదు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ని కూడా తొలగించండి. ’’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో నాలుగు రోజుల క్రితం కొత్త పార్లమెంటు భవనం పైన ప్రధాని మోదీ మతపరమైన వేడుక ను నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. అయితే తాజాగా విమర్శలపై లోక్సభ సెక్రటేరియట్ స్పందిచింది. ప్రతీ సమావేశానికి ముందు ఇలా బులిటెన్ లు, మార్గదర్శకాలు జారీ చేయడాలు సాధారణమైన ప్రక్రియ అని తెలిపింది. ఇదేం కొత్త పద్దతి కాదని స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా పార్లమెంటు సెక్రటరీ జనరల్ విడుదల చేసిన అన్ పార్లమెంటరీ పదాలపై రచ్చ జరుగుతోంది. పార్లమెంటులో ఇకపై మాట్లాడలేని పదాలు చాలా ఉన్నాయని, మాట్లాడే టప్పుడు వాటిని ప్రొసీడింగ్స్లో చేర్చబోమని అందులో చెప్పారు. ఈ పదాలలో జుమ్లాజీవి, బాల్ బుద్ధి ఎంపీ, శకుని, జైచంద్, లాలీపాప్, చందల్ క్వార్టెట్, గుల్ ఖిలాయే, పితు వంటి పదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో మరో కీలక ఉత్తర్వు జారీ అయ్యింది. ఇకపై నుంచి పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు లేదా మతపరమైన వేడుకలు నిర్వహించరాదని రాజ్యసభ సెక్రటేరియట్ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జులై 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ విడుదల చేసిన కొత్త బులెటిన్లో సభ్యుల సహకారం కోరుతున్నట్లు పేర్కొంది. పార్లమెంట్ ఆవరణలో సభ్యులు ఎటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు లేదా ఏదైనా మతపరమైన వేడుకలు చేయరాదని, వీటి కోసం పార్లమెంటు హౌస్ ఆవరణను ఉపయోగించలేరని బులెటిన్లో పేర్కొంది.
Kanwar Yatra: కట్టుదిట్టమైన భద్రత మధ్య కన్వర్ యాత్ర.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు !
జాతీయ చిహ్నం, పార్లమెంటు వర్షాకాల సమావేశంలో నిషేధించిన పదాలను రూపొందిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బుక్ లెట్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ‘‘ మీరు పార్లమెంటులో మాట్లాడే విషయాల్లో సందర్భం ముఖ్యం. మీరు కేవలం పదాలను అన్పార్లమెంటరీ పదాలు అని చెప్పలేరు. కాంస్య జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సమయంలో ప్రధాని వెనుక స్పీకర్ కూర్చోవడం అన్పార్లమెంటరీ కాదా? ’’ అని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన గురువార మీడియాతో మాట్లాడారు.