
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు తిరిగి పునరుద్దరించబడ్డాయి. దాదాపు రెండు గంటల తర్వాత వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. . అయితే తొలుత చాలా మంది వినియోగదారులు తమ ఇంటర్నెట్ సమస్యగా భావించారు. అయితే కొద్దిసేపటికే ఇది వాట్సాప్లో తలెత్తిన సాంకేతిక సమస్య అని తెలుసుకున్నారు. పలువురు వాట్సాప్ యూజర్లు.. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాల వేదికగా వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడం తమదైన శైలిలో మీమ్స్తో హోరెత్తించారు.
వాట్సాప్ సేవల అంతరాయంపై వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా స్పందించింది. ‘‘కొంతమందికి ప్రస్తుతం సందేశాలు పంపడంలో సమస్య ఉందని మాకు తెలుసు. వీలైనంత త్వరగా అందరికీ WhatsAppని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాం’’ అని మెటా కంపెనీ ప్రతినిధి చెప్పారు. అయితే దాదాపు రెండు గంటల తర్వాత సర్వీసులు పునరుద్దరణ జరిగింది. తొలుత పాక్షికంగా సేవలు పునరుద్దరణ జరగగా.. తర్వాత కొన్ని నిమిషాల్లోనే వాట్సాప్ సేవలు పూర్తిగా తిరిగి ప్రారంభం అయ్యాయి.
ఇక, ప్రముఖ ఆన్లైన్ టూల్ డౌన్ డిటెక్టర్ మధ్యాహ్నం 12.07 గంటలకు అసాధారణంగా అధిక సమస్య నివేదికలను గుర్తించడం ప్రారంభించింది. మధ్యాహ్నం 1 గంటలోపు అలాంటి వేలాది నివేదికలు రిపోర్ట్ చేయబడ్డాయి. భారతదేశంలో సుమారు 28,413 మంది వినియోగదారులు తమ వెబ్సైట్లో మధ్యాహ్నం 12:30 గంటలకు సమస్యను నివేదించారు. సమస్యను నివేదించిన 69 శాతం మంది వ్యక్తులు సందేశాలను పంపడంలో సమస్య ఉన్నట్లు ఫిర్యాదు చేయగా, 7 శాతం మంది యాప్తో సమస్యను ఎదుర్కొంటున్నారు మరియు వారిలో 24 శాతం మంది సర్వర్ కనెక్షన్తో సమస్యను నివేదించారు. ఇక, భారత్తో సహా పలు దేశాలకు చెందిన సోషల్ మీడియా వినియోగదారులు కూడా సందేశాలు పంపలేకపోతున్నారని పోస్ట్లు చేస్తున్నారు.