అదానీతో సంబంధ‌మేంటి? ఏదో ఒక రోజు సత్యాన్ని ఎదుర్కోక త‌ప్ప‌దు.. : ప్ర‌ధాని మోడీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్య‌లు

Published : Feb 14, 2023, 01:26 PM IST
అదానీతో సంబంధ‌మేంటి? ఏదో ఒక రోజు సత్యాన్ని ఎదుర్కోక త‌ప్ప‌దు.. :  ప్ర‌ధాని మోడీపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్య‌లు

సారాంశం

Wayanad: "నేను ప్రధానిని కొన్ని ప్రశ్నలు అడిగాను. అదానీతో ఉన్న అనుబంధం గురించి అడిగాను. ప్రధాని ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు.. ఏదో ఒక రోజు స‌త్యాన్ని ఎదుర్కొక త‌ప్ప‌దు.." అని కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ‌య‌నాడ్ స‌భ‌లో అన్నారు.  

Congress leader Rahul Gandhi In Wayanad: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధాని త‌న‌ను అవ‌మాన‌ప‌ర్చేలా వ్యాఖ్యానించినా.. తాను మాత్రం ఆయ‌న‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. తాను అదానీతో ఉన్న సంబంధ‌మేంట‌ని అడిగాన‌నీ, దీంతో త‌న వ్యాఖ్య‌ల‌ను పార్ల‌మెంట్ రికార్డుల నుంచి తొల‌గించారని అన్నారు. "నేను ప్రధానిని కొన్ని ప్రశ్నలు అడిగాను. అదానీతో ఉన్న అనుబంధం గురించి అడిగాను. ప్రధాని ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు.. ఏదో ఒక రోజు స‌త్యాన్ని ఎదుర్కొక త‌ప్ప‌దు.." అని రాహుల్ గాంధీ అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. తన పేరు గాంధీ అని, నెహ్రూ కాకపోతే ప్రధాని తనను నేరుగా అవమానించారనీ, కానీ ఆయన మాటలను లోక్ సభ సమావేశాల నుంచి తొలగించలేదన్నారు. అలాగే, తన, ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ పై దృష్టి పెట్టాలని సమావేశానికి హాజరైన వారిని రాహుల్ గాంధీ కోరారు. "నేను మాట్లాడుతున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా నా ముఖం చూస్తే చాలు. ఆయన (ప్రధాని మోదీ) మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం చూడండి. ఎన్నిసార్లు నీళ్లు తాగాడో చూడండి. నీళ్లు తాగుతూ చేతులు ఎలా వణికిపోతున్నాయో మీకే అర్థమవుతుందంటూ" రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

'అదానీపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు'

వ‌య‌నాడ్ బహిరంగ సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'నేను ప్రధానిని కొన్ని ప్రశ్నలు అడిగాను. అదానీతో ఉన్న అనుబంధం గురించి అడిగాను. అదానీ ఇంత వేగంగా ఎలా ఎదిగారని అడిగాను. ప్రధాని ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నన్ను నెహ్రూ అని ఎందుకు పిలవరు, నన్ను గాంధీ అని ఎందుకు పిలుస్తారు అనే నా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారతదేశంలో సాధారణంగా తండ్రి అనే ఇంటిపేరును ఉపయోగిస్తారని ప్రధాని మోడీకి అర్థం కాకపోవచ్చున‌ని అన్నారు.  'నేను చాలా హుందాగా, గౌరవప్రదంగా మాట్లాడాను. నేను ఎలాంటి చెడు భాషను ఉపయోగించలేదు. నేను ఎవరినీ దూషించలేదు. నేను కొన్ని వాస్తవాలను మాత్రమే లేవనెత్తాను" అని మోడీ తీరుపై మండిప‌డ్డారు. 

మోడీ తనను తాను శక్తిమంతుడిగా భావించవచ్చు కానీ...

"ఆయన (ప్రధాని మోడీ) అర్థం చేసుకోలేరు, నేను భయపడుతున్న చివరి విషయం ఆయనే. ఆయన ప్రధాని అయినా, ఆయనకు అన్ని ఏజెన్సీలు ఉన్నాయా... నిజం వారికి అనుకూలంగా లేదు కాబట్టి ఫరవాలేదు. ఏదో ఒక రోజు వారు సత్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు. నిజం ఎప్ప‌టికైనా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. అదానీ గ్రూప్ పై తాను చేసిన ఆరోపణల గురించి  రాహుల్ గాంధీ మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని నడుపుతున్న వారిని ఏజెన్సీలు భయపెట్టాయనీ, ఆ తర్వాత అదానీకి అన్ని విమానాశ్రయాలు దక్కాయని అన్నారు. పోర్టు, రక్షణ, బొగ్గు, గనులు, రోడ్లు, వ్యవసాయం సహా అన్ని పరిశ్రమల కాంట్రాక్టులు పొందారని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu