Vizhinjam Port : విజింజామ్ నౌకాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలో కశ్మీర్ టెర్రరిస్ట్ దాడి గురించి కేరళ సీఎం పినరయి విజయన్ ప్రస్తావించారు. పహల్గాం దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ ఆయన ప్రసంగం మొదలుపెట్టారు.
విజింజాం వంటి ప్రాజెక్టులు సక్సెస్ కావాలంటే ప్రజల ఐక్యతే కీలకం... మనం అది సాధించడం గర్వకారణమని సీఎం విజయన్ అన్నారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కానీ కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ గురించి మాత్రం మాత్రం ప్రస్తావించలేదు.
కేరళ కల నెరవేరింది... ఇది గర్వించదగ్గ క్షణం... ఇది కేవలం పోర్ట్ ప్రారంభోత్సవం కాదు కేరళలో ఓ పండగ అన్నారు. ఈ నౌకాశ్రయం ద్వారా దేశ అభివృద్ధి అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టే అని సీఎం అన్నారు. ఇండియాను అంతర్జాతీయ వాణిజ్యంతో కలుపుతున్న మెగా ప్రాజెక్ట్ ఇదని పినరయి విజయన్ అన్నారు.
చరిత్రలో మరుగున పడిన విజింజామ్ ను తిరిగి అంతర్జాతీయ పోర్ట్గా అభివృద్ధి చేయడం కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ పట్టుదల, దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న పోర్ట్గా ఇది మారుతోందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. దీనిని పూర్తి చేయడంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు
మొదటిసారిగా ఇండియాలో ఒక రాష్ట్రం ఆధ్వర్యంలో భారీ పోర్ట్ నిర్మాణం జరిగిందన్నారు. విజింజామ్ నిర్మాణ ఖర్చులో ఎక్కువ భాగం రాష్ట్రమే భరించిందని... రూ.8,686 కోట్లలో రూ.5,370.86 కోట్లు రాష్ట్రం వాటా అని సీఎం చెప్పారు. మిగిలిన రూ.2,497 కోట్లు అదానీ గ్రూప్ పెట్టిందన్నారు. మరో రూ.818 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కేంద్రం ఇస్తోందన్నారు.
ఈ పోర్ట్ వల్ల 220 మిలియన్ డాలర్ల వార్షిక నష్టం తగ్గుతుందన్నారు. 75 శాతం కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో విదేశీ పోర్టులకు వెళ్లేది... ఇప్పుడు అది ఆగుతుందన్నారు. భారీ నష్టాన్ని తగ్గించడంలో కేరళ సక్సెస్ అయింది అని సీఎం పినరయి అన్నారు.
ఒప్పందం ప్రకారం 2045లో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ 2024లోనే కమర్షియల్ ఆపరేషన్స్ మొదలయ్యాయని సీఎం విజయన్ తెెలిపారు. 250కి పైగా షిప్పులు ఇప్పటికే విజిజాంలో లంగరు వేశాయన్నారు. ఇప్పుడు మొదట దశ పూర్తయ్యింది... 2028 నాటికి అన్ని దశలు పూర్తవుతాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటివి ఆటంకాలు కలిగించినా కేరళ, నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గలేదన్నారు.
1996లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్ట్ ఇది... 2009లో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ దీనిని అధ్యయనం చేసిందన్నారు. 2010లో టెండర్లు జరిగినా కేంద్రం అనుమతి నిరాకరించిందని.... ఆ తర్వాత మానవహారం వంటి నిరసనలు జరిగాయని గుర్తుచేసారు. 2015లో ఒప్పందం కుదిరినా విమర్శలు వచ్చాయి. అయినా ప్రాజెక్ట్ పూర్తి కావాలనేది తమ ఉద్దేశమని అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు వద్దు అనేది తమ విధానమన్నారరు. 2016లో అధికారంలోకి వచ్చాక విజింజామ్ భారీ పోర్ట్గా మారడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం... అందుకే ఈరోజు ఇది సాధ్యమైందన్నారు.
ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని కొందరు సృష్టించిన అపోహలను తొలగించామని.... చట్టపరమైన చిక్కుముడులు వీడాయన్నారు. తీరప్రాంత పునరావాసం, జీవనోపాధి సమస్యలను రూ.120 కోట్లతో పరిష్కరించామని... అక్కడి అమ్మాయిలకు క్రేన్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించాం. ఇలా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లామన్నారు. 5,000కు పైగా ఉద్యోగాలు ఈ పోర్ట్ ద్వారా లభిస్తాయని.. ఇంకా ఎక్కువ మందికి ఉపయోగం కలిగేలా చూస్తామన్నారు. కేరళ, ఇండియా అభివృద్ధికి ఈ పోర్ట్ దోహదపడుతుంది సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.