ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తోన్న యాపిల్ ఉద్యోగి వివేక్ తివారీ కాల్పుల ఘటనలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పోలీసు కాల్పుల్లో మృతిచెందిన వివేక్ తివారీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. నష్టపరిహారం కూడా ప్రకటించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తోన్న యాపిల్ ఉద్యోగి వివేక్ తివారీ కాల్పుల ఘటనలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పోలీసు కాల్పుల్లో మృతిచెందిన వివేక్ తివారీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. నష్టపరిహారం కూడా ప్రకటించింది.
అటు కాల్పుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ భార్యకు సైతం భారీగా విరాళాలు వచ్చాయి. ప్రశాంత్ భార్యకు అండగా ఉండాలంటూ తోటి పోలీసులంతా ఫేస్ బుక్ కాంపైన్ చేపట్టి అండగా నిలిచారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ భార్యకు భారీ విరాళాలు వచ్చి పడటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వివేక్ తివారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురి భార్య రేఖా మాలిక్ అకౌంట్లోకి రాత్రి రాత్రే అక్షరాలా 5 లక్షల రూపాయలు జమయ్యాయి. కేవలం 447 రూపాయలు మాత్రమే కలిగి ఉన్న తన అకౌంట్లోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే శుక్రవారం అర్థరాత్రి సమయంలో యాపిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు ఆపినా ఆపకపోవడంతో కోపోద్రోక్తుడైన కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరి అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో వివేక్ తివారీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తన భర్తను అన్యాయంగా బలి తీసుకున్నప్రశాంత్ చౌధురిని కఠినంగా శిక్షించాలంటూ వివేక్ భార్య కల్పనా తివారీ డిమాండ్ చేశారు. కారు ఆపకపోతే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశఆరు. అయితే ఆత్మరక్షణ కోసమే తన భర్త కాల్పులు జరిపారని, అనవసరంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కానిస్టేబుల్ ప్రశాంత్ భార్య రాఖీ మాలిక్ ఆరోపించారు.
కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురికి అండగా నిలవాలని తోటి ఉద్యోగి వీర్ సింగ్ రాజు అనే వ్యక్తి కాంపైన్ స్టార్ట్ చేశాడు. ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉందామంటూ ఫేస్బుక్ ద్వారా ఓ క్యాంపెయిన్ ప్రారంభించాడు.
కాల్పుల విషయంలో మన సోదరులకు సీనియర్ పోలీసు అధికారులు ఏమాత్రం అండగా నిలవడం లేదు. కాబట్టి ప్రశాంత్ చౌధురి, సందీప్ రానాలకు మన వంతు సాయం చేయాలి. వారికి న్యాయం జరిగేలా చూడాలి అంటూ రాజు ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ చేశాడు. సాయం చేయాలనుకుంటున్న వారు ఈ అకౌంట్లోకి మీకు తోచినంత డబ్బు జమచేయగలరు అని ప్రశాంత్ భార్య రాఖీ మాలిక్ అకౌంట్ నంబరును షేర్ చేశాడు.
అయితే పోస్టు వైరల్గా మారడంతో ప్రశాంత్, సందీప్ల కుటుంబాలకు సాయం చేసేందుకు వేలాది మంది ముందుకొచ్చారు. ఎవరికి తోచినంత వారు సాయం చేయడం మొదలు పెట్టారు. దీంతో రేఖా మాలిక్ అకౌంట్లోకి 5 లక్షల 28 వేల రూపాయలు వచ్చి చేరాయి.
మరోవైపు వివేక్ తివారి హత్య ఉదంతం ఉత్తరప్రదేశ్లో రాజకీయ దుమారం రేగుతోంది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాత్రం తాను రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేశామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.