
Stones thrown at Vande Bharat train in Kerala: కేరళలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పై మలప్పురం జిల్లాలోని తిరునావయ, తిరూర్ మీదుగా వెళ్తుండగా రాళ్లదాడి జరిగింది. కొందరు దుండగులు రైలు వెళ్తుండగా రాళ్లు రువ్వారు.
వివరాల్లోకెళ్తే.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలోనే మరో వందే భారత్ రైలు పై రాళ్ల దాడి జరిగింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మలప్పురం జిల్లాలోని తిరునావయ, తిరూర్ మీదుగా వెళ్తుండగా రాళ్లదాడి జరిగింది. సీ4 బోగీలోని 62, 63 సీట్ల కిటికీలపై దుండగులు రాళ్లు రువ్వారు. మలప్పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. రైల్వే పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు పీటీఐ నివేదికలు పేర్కొన్నాయి.
కేరళలోని తొలి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మలప్పురం జిల్లాలోని తిరూర్ స్టేషన్ వద్ద ఆగాలని కోరుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నిరసనలు చేపట్టింది. వందే భారత్ రైలును ప్రకటించిన వెంటనే మొదటి రిపోర్టుల్లో తిరూర్ కూడా స్టాప్ ల జాబితాలో ఉంది. అయితే, తరువాత, షోర్నూర్ చేర్చబడినప్పుడు దానిని తొలగించారు.
ఈ దాడిపై స్పందించిన కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, రైలు కిటికీలు పగిలిన వీడియోను షేర్ చేశారు. "మలప్పురంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై జరిగిన రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటన చాలా దురదృష్టకరం. కేరళ మొత్తానికి సిగ్గుచేటు. మొదటి రోజు నుంచే కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.