
UP Election 2022: భారతరత్న, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ.. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన, ఆలయ నగరాలైన కాశీ, మధురల అభివృద్ధితో సహా అనేక సమస్యలను పరిష్కరించే విధంగా రూపొందించిన ‘లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్ర’ మేనిఫెస్టో ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉదయం 10.15 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, కేపీ మౌర్య, స్వతంత్ర దేవ్ సింగ్ లు. కానీ. సింగర్ లతా మంగేష్కర్ ఆకాల మరణం తెలియడంతో 2 నిమిషాల పాటు మౌనం పాటించి.. దిగ్గజ గాయకుడికి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో విడుదలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
అటు, ప్రధాని మోడీ కూడా తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ రోజు గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని వర్చువల్ ప్రచారం కూడా రద్దైంది. మోదీ ర్యాలీతో పాటు ఇతర కార్యక్రమాలను సైతం నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గోవా ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రూపొందించిన మేనిఫెస్టో విడుదలను సైతం వాయిదా వేసినట్టు తెలిపారు. అలాగే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం కూడా రద్దైందని చెప్పారు.లతా మంగేష్కర్ గౌరవార్థం గోవాలో రెండు రోజుల పాటు సంతాప దినాలను పాటించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
లెజండరీ సింగర్ కన్నుమూత..
కరోనా బారినపడి కోలుకున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొవిడ్ అనంతరం 28 రోజుల పాటు ఆమె చికిత్స తీసుకున్నారని... పలు అవయవాలు దెబ్బతినటం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి తన ప్రకటనలో పేర్కొంది.
లతా అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరు
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఆదివారం సాయంత్రం 6ః15 నిమిషాలకు ముంబైలోని శివాజీ పార్కులో లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరుగుతాయి. సాయంత్రం వరకు ప్రధాని మోదీ ముంబై చేరుకుంటారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘లతా మంగేష్కర్కు నివాళులు అర్పించేందుకు మరి కాసేపట్లో ముంబైకి వెళ్తున్నా.’ అని మోదీ ట్వీట్ చేశారు.