భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రత్యేక పూజలు..

Published : Jul 03, 2022, 09:25 AM IST
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రత్యేక పూజలు..

సారాంశం

హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.   

హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ స్వయంగా అమ్మవారికి హారతినిచ్చారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, పలువురు బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. 

తొలుత యోగి ఆదిత్యనాథ్ శనివారం రోజునే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రానున్నట్టుగా బీజేపీ నేతలు తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల యోగి పర్యటన వాయిదా పడింది. దీంతో ఆయన నేడు అమ్మవారిని దర్శించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. ఆలయ పరిసరాల్లో మూడు వలయాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. 

ఇదిలా ఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన పలువురు బీజేపీ అగ్రనేతలు గత రెండు రోజులుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రాధామోహన్ సింగ్, బీహార్ ఎంపీ పూర్వీ చంపారన్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, ఉత్తరప్రదేశ్ ఎంపీ రేఖా వర్మ సహా పలువురు ప్రముఖులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో వారు పూజలు నిర్వహించారు. 

ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు సోమవారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చార్మినార్‌కు వచ్చే అవకాశం కూడా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

పలువురు బీజేపీ ప్రముఖులు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), టాస్క్ ఫోర్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, స్థానిక పోలీసు సిబ్బందిని మోహరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) సాయి చైతన్య, ఇతర పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పాతబస్తీలోని పలు ముఖ్యమైన, సున్నితమైన ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

Mumbai Family Death: వీడిన పుచ్చ‌కాయ‌, బిర్యానీ మ‌ర‌ణాల మిస్ట‌రీ.. ఇంత‌కీ వాళ్లు ఎలా చ‌నిపోయారంటే
సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu