
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైపూర్ వైశాలి నగర్లోని బూత్ నెం. 252లో రాథోడ్ ఓటు వేశారు.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలనున్న రాజస్థాన్ శాసనసభలో... రామ్గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.
మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... వీరిలో 189 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలిసారిగా మహిళల కోసం 200 పింక్ బూత్లను ఏర్పాటు చేశారు.