ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ: ఉచిత ఆహార ధాన్యాలకు ఆమోదం.. కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published May 5, 2021, 2:24 PM IST
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఫేజ్-3 క్రింద అదనంగా ఆహార ధాన్యాలను మే, జూన్ నెలల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఫేజ్-3 క్రింద అదనంగా ఆహార ధాన్యాలను మే, జూన్ నెలల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు.

నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో సహా మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 79.88 కోట్లు ఉంటుందని అంచనా. 

జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద అమల్లో ఉన్న కేటాయింపుల దామాషా ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గోధుమలు, బియ్యం కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్థానికంగా అమలవుతున్న లాక్‌డౌన్ పరిస్థితులు, తుపానులు, భారీ వర్షాలు, ఆహార సరఫరాలు, కోవిడ్ సంబంధిత ఆంక్షలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత పంపిణీని ఎంత కాలం కొనసాగించాలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిర్ణయిస్తుందని కేంద్రం వెల్లడించింది.

మొత్తం మీద సుమారు 80 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. సుమారు 79.88 కోట్ల మందికి నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రెండు నెలలపాటు పంపిణీ చేయడానికి ఆహార సబ్సిడీ సుమారు రూ.25,332.92 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపింది.

Also Read:ఇండియాలో కరోనా జోరు: ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో మరణాలు

మొత్తం మీద ఒక మెట్రిక్ టన్ను బియ్యానికి రూ.36,789.2; ఒక మెట్రిక్ టన్ను గోధుమలకు రూ.25,731.4 ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పేదల కష్టాలను తొలగించేందుకు ఈ అదనపు ఆహార ధాన్యాల సరఫరా దోహదపడుతుందని వెల్లడించింది. 

మరోవైపు పీఎం-కేర్స్ నిధులతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రుల్లో రెండు హై ఫ్లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం వివరించింది. బుధవారం నుంచి ఈ ప్లాంట్ల ద్వారా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా ప్రారంభమవుతుందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుందని, ఇప్పటి వరకు 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్ జరగిందని వెల్లడించింది. 18 నుంచి 44 ఏళ్ల వయసు గల వారిలో సుమారు 6.7 లక్షల మందికి ఫేజ్-3లో వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపింది. 

click me!