దేశంలో 8.30 శాతానికి పెరిగిన నిరుద్యోగం.. 16 నెలల్లో అత్యధికం : సీఎంఐఈ

Published : Jan 01, 2023, 03:55 PM IST
దేశంలో 8.30 శాతానికి పెరిగిన నిరుద్యోగం.. 16 నెలల్లో అత్యధికం : సీఎంఐఈ

సారాంశం

New Delhi: 16 నెలల గరిష్ట స్థాయికి నిరుద్యోగిత రేటు పెరిగింది. 2022 డిసెంబర్ నెలలో 8.3 శాతానికి చేరిందని సీఎంఐఈ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. అయితే,  కార్మికుల భాగస్వామ్య రేటులో ఆరోగ్యకరమైన పెరుగుదల కారణంగా నిరుద్యోగిత రేటు క‌నిపించినంత చెడ్డదిగా లేద‌ని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ అన్నారు.  

India's unemployment rate rose to 8.30% : దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. ఏకంగా 16 నెల‌ల గ‌రిష్టానికి చేరుకుంది. ఉపాధి కోల్పోతున్న ప‌రిస్థితులు సైతం ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం భార‌త దేశ నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి పెరిగింది. 

వివ‌రాల్లోకెళ్తే.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగ రేటు డిసెంబర్ లో (2022) 8.30 శాతానికి పెరిగింది. ఇది 16 నెలల్లో అత్యధికం, అంతకుముందు నెలలో 8.00 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 8.30 శాతానికి పెర‌గ‌డం గ‌మ‌నార్హం. పట్టణ నిరుద్యోగిత రేటు గత నెలలో 8.96 శాతం నుండి డిసెంబర్ లో 10.09 శాతానికి పెరిగింది. గ్రామీణ నిరుద్యోగ రేటు 7.55 శాతం నుండి 7.44 శాతానికి పడిపోయింది. ప్ర‌స్తుతం నిరుద్యోగ రేటు, నిరుద్యోగ ప‌రిస్థితుల‌ను గురించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ మాట్లాడుతూ, నిరుద్యోగ రేటు పెరుగుదల క‌నిపించినంత చెడ్డ‌దిగా లేద‌ని అన్నారు. ఎందుకంటే గ‌త డిసెంబర్ లో 40.48 శాతానికి పెరిగింది.. ఇది 12 నెలల్లో అత్యధికమ‌ని చెప్పారు. 

అలాగే, కార్మికుల భాగస్వామ్య రేటులో ఆరోగ్యకరమైన పెరుగుదల కారణంగా నిరుద్యోగిత రేటు క‌నిపించినంత చెడ్డదిగా లేద‌ని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఉపాధి రేటు డిసెంబర్లో 37.1 శాతానికి పెరిగింది, ఇది జనవరి 2022 తర్వాత అత్యధికం అని ఆయ‌న చెప్పిన‌ట్టు రాయిట‌ర్స్ నివేదించింది. కాగా, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, జాబ్ మార్కెట్లోకి ప్రవేశించే మిలియన్ల మంది యువతకు ఉద్యోగాలను సృష్టించడం 2024 లో జాతీయ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనకు అతిపెద్ద సవాలుగా ఉంది. పెరుగుతున్న నిత్యావ‌స‌ర‌ల ధ‌ర‌లు, నిరుద్యోగం వంటి అంశాల‌ను లేవ‌నెత్తుతూ ఇప్ప‌టికే కేంద్ర‌లో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశాయి. తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతున్నాయి. ఇదే విష‌యంపై కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర నిర్వ‌హిస్తూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు, ప్ర‌జ‌ల‌ను ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తం చేస్తూ దేశ‌వ్యాప్త యాత్ర‌ను నిర్వ‌హిస్తోంది. 

జీడీపీ వృద్ధిపై ఒకే దృష్టి నుంచి ఉపాధి కల్పన, యువతకు నైపుణ్యం, ఎగుమతి అవకాశాలతో ఉత్పత్తి సామర్థ్యాలను సృష్టించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం విలేకరులతో అన్నారు. అంతకుముందు త్రైమాసికంలో 7.6 శాతంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగ రేటు 7.2 శాతానికి తగ్గిందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సంకలనం చేసి నవంబర్ లో విడుద‌ల చేసిన ప్రత్యేక త్రైమాసిక డేటా తెలిపింది. డిసెంబరులో ఉత్తర రాష్ట్రమైన హర్యానాలో నిరుద్యోగిత రేటు 37.4 శాతానికి, రాజస్థాన్ లో 28.5 శాతానికి, ఢిల్లీలో 20.8 శాతానికి పెరిగిందని సీఎంఐఈ డేటా తెలిపింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ  ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !