
తమిళనాడు : కామంతో కళ్ళు మూసుకుపోయి, వావి వరసలు మరిచిపోయి, చిన్నా,పెద్ద తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు కీచకులు. ఇళ్లల్లోని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతూ సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. సొంత కూతుర్లు, తమ్ముడి కూతుర్లు…మనవరాళ్లు, చెల్లెలు.. ఇలాంటి వరుసలేవి ఈ కామాంధుల కంటికి కనిపించడం లేదు. అత్యంత నిసిగ్గుగా దారుణాలకు ఒడిగడుతున్నారు.
అలాంటి ఓ జుగుస్సాకరమైన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. పెద్దమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసుకోవడానికి వచ్చిన బాలికపై.. పెదనాన్న, అన్నఆరేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిరుప్పూర్ జిల్లా తారాపురానికి దగ్గర్లో ఉన్న కొండరసంపాళ్యం గ్రామానికి చెందిన తంగరాజ్ (50) అనే వ్యక్తి జిరాక్స్ మిషన్ సర్వీసింగ్ సెంటర్ ని నడుపుతుంటాడు.
అతని భార్య దివ్యాంగురాలు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడం తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో.. ఆరేళ్ల క్రితం తమ్ముడు కుమార్తె అయిన పదవ తరగతి చదువుతున్న బాలికను సహాయం కోసం తంగరాజ్ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బాలిక అక్కడే ఉంటూ చదువుకుంటూ.. ఇంటి పనులకు సహాయం చేస్తూ ఉండేది. బాలిక వచ్చిన కొద్ది రోజుల తర్వాత తంగరాజ్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అలా, గత ఆరేళ్లుగా అది కొనసాగిస్తున్నాడు. బాలిక పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్ కంప్లీట్ చేసింది. తారాపురంలోని డిగ్రీ కాలేజీలో చేరింది. ఆ సమయంలో అన్న వరసయ్యే ప్రకాష్ అనే వ్యక్తికి ఈ విషయం తెలిసింది. బాలిక మీద తంగరాజ్ అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరిస్తూ అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో యువతి మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది.
మన స్థాపానికి గురైన ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. తారాపురం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తంగరాజ్, ప్రకాష్ లని అరెస్టు చేశారు. ఆ విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. తంగరాజ్, ప్రకాష్ ల మీద ఫోక్సో కేసు నమోదు చేశారు.