
బెంగుళూరు: నగరంలోని క్రాంతివీర సంగోలి రాయన్న(కెఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో శనివారంనాడు ఉదయం ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. ఉద్యాన ఎక్స్ ప్రెస్ రైలులో మంటల కారణంగా భారీగా పొగ వెలువడింది. మరో వైపు రైలులోని రెండు కోచ్ లలో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. బెంగుళూరు రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.ముంబై-బెంగుళూరు ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ గమ్యస్థానానికి చేరుకున్న రెండు గంటల తర్వాత మంటలు చెలరేగాయి. ఇవా ఉదయం ఏడున్నర గంటల సమయంలో రైలులోని రెండు కోచ్ ల నుండి పొగలు వచ్చాయి.
ముంబై నుండి బెంగుళూరుకు ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ (11301) రైలు ఇవాళ ఉదయం 05:45 గంటలకు చేరుకుంది. అయితే ఉదయం ఏడున్న ర గంటలకు రైలులోని కోచ్ లలో మంటలు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ లోని మూడో ఫ్లాట్ ఫారంపై రైలు నిలిచిన ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. రైల్వే స్టేషన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.ఫైర్ ఫైటర్లు నిమిషాల వ్యవధిలో మంటలను ఆర్పారు.
ఉద్యాన్ రైలులోని బీ1, బీ2 కోచ్ లలో మంటలు వ్యాపించి దట్టమైన పొగ వ్యాపించింది.
ఈ పొగ కారణంగా రైల్వేస్టేషన్ లో ప్రయాణీకులు ఆందోళన చెందారు. రైల్వేస్టేషన్ కు సమీపంలోని మెజిస్టిక్ బస్టాండ్ వద్ద కూడ పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని రైల్వే శాఖ పీఆర్ఓ అనీష్ హెగ్డే తెలిపారు. రైల్వే సీనియర్ అధికారులు, సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు ఈ రెండు కోచ్ లలో మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.