మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కొడుకులు ఆదిత్య, తేజ, భార్య రష్మితో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కొడుకులు ఆదిత్య, తేజ, భార్య రష్మితో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఠాక్రే కుటుంబం నుండి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా ఉద్దవ్ ఠాక్రే చరిత్రలో నిలిచాడు. 2019 అక్టోబర్ మాసంలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించాడు.
ఉద్దవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఆదిత్యకు స్థానం దక్కింది. రాష్ట్రంలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల్లో ఒక్కరిని పోటీ నుండి ఉపసంహరించుకోవాలని ఆదివారం నాడు సాయంత్రం నిర్ణయం తీసుకొంది. దీంతో 9 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ నెలకొంది.
రాష్ట్రంలోని ఎగువ సభకు ఠాక్రే ఎన్నికకు మార్గం సుగమంగా మారింది. శివసేన సీనియర్ నాయకులు సంజయ్ రౌత్, సుభాష్ దేశాయ్, ఎక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ,కాంగ్రెస్ నేత ఆశోక్ చవాన్ , బాలా సాహెబ్ థోట్ లు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నెల 21వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ నెల 27వ తేదీ లోపుగా ఉద్దవ్ ఠాక్రే అసెంబ్లీ లేదా శాసనమండలిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని ఉద్దవ్ ఠాక్రే సర్కార్ వినతి మేరకు ఎన్నికలు నిర్వహిస్తోంది.
ఇవాళ సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మెన్ గా కొనసాగుతున్న నీలమ్ ఘోరే కూడ నామినేషన్ దాఖలు చేశారు.
గత ఏడాది నవంబర్ 28వ తేదీన మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుండి అమోల్ మిట్కరి, శశికాంత్ షిండే, కాంగ్రెస్ నుండి రాజేష్ రాథోడ్ లు కూడ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.బీజేపీ నుండి నలుగురు అభ్యర్థులు గత వారంలోనే నామినేషన్లు దాఖలు చేశారు.