
Azadi ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 మధ్య తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నారు. అంతకుముందు ప్రధాని తన నెలవారీ రేడియో ప్రసారమైన మన్ కీ బాత్లో మాట్లాడుతూ.. భారతదేశం ఈ సంవత్సరం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నది. ఇది ఎంతో ప్రత్యేకమని పేర్కొంటూ త్రివర్ణ పతాకాన్ని వారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకోవాలని ప్రజలను కోరారు.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ.. భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నారు. ప్రధానమంత్రిని అనుసరిస్తూ.. కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జి, కిషన్ రెడ్డి, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు తమ డీపీలను త్రివర్ణ పతాకానికి మార్చుకున్నారు. "ఈరోజు ఆగస్టు 2వ తేదీ ప్రత్యేకం! మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న తరుణంలో మన దేశం మన త్రివర్ణ పతాకాన్ని జరుపుకునే సామూహిక ఉద్యమం అయిన హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. నేను నా సోషల్ మీడియా పేజీలలో DPని మార్చాను. మీరందరూ అలాగే చేయాలని కోరుతున్నాను" అని ప్రధాని ట్వీట్ చేశారు.
జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ , “మనం ఎంతో గర్వించదగ్గ త్రివర్ణ పతాకాన్ని మనకు అందించడానికి ఆయన చేసిన కృషికి మన దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. త్రివర్ణ పతాకం నుండి శక్తిని, స్ఫూర్తిని తీసుకుంటూ ఉంటుంది. మనం దేశ ప్రగతికి కలిసి కృషి చేద్దాం" అని పేర్కొన్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు బీజేపీ అనేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ సభ్యుల కోసం నడ్డా అనేక కార్యకలాపాలను జాబితా చేశారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ.. సాంస్కృతిక శాఖ బుధవారం ఉదయం ఎంపీల కోసం ఎర్రకోట నుంచి పార్లమెంట్ వరకు తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించనుందని, దీనికి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మావేశంలో నడ్డా "హర్ ఘర్ తిరంగా" ప్రచారాన్ని, దాని యువజన విభాగం దేశవ్యాప్తంగా బైక్లపై "తిరంగా యాత్ర" నిర్వహించేందుకు "ప్రభాత్ ఫేరీ" (ఉదయం ఊరేగింపు) ఉదయం 9 నుండి 11 గంటల మధ్య నిర్వహించాలని పార్టీ సభ్యులను కోరారు.
"మన జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి చిహ్నం. ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు, ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇంట్లో మన జెండాను ఎగురవేయాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో మన తిరంగను ప్రదర్శించాలని నేను కోరుతున్నాను" అని నడ్డా ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన భక్తిగీతమైన "రఘుపతి రాఘవ రాజా రామ్" లేదా భారతదేశ జాతీయ గీతం "వందేమాతరం"ని ప్లే చేస్తూ ఆగస్టు 11, ఆగస్టు 13 మధ్య బీజేపీ సభ్యులు బూత్ స్థాయిలో "ప్రభాత్ ఫేరీ"ని కూడా నిర్వహిస్తారని తెలిపారు.