తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:51 PM (IST) Aug 11
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘లిజియన్ ఆఫ్ హానర్’ దక్కింది. ఆయన ప్రసంగాలు, రచనలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2010లో థరూర్కు స్పెయిన్ ప్రభుత్వం సైతం ఇలాంటి అవార్డునే ఆయనకు అందించింది. తాజాగా ఫ్రాన్స్ పురస్కారం థరూర్కు రావడంతో ఆయనకు పార్టీలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
09:19 PM (IST) Aug 11
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు భద్రత కల్పించే అవకాశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. తన ప్రాణాలకు ముప్పు వుందని, తనకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రవీణ్ ఈ నెల 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
08:34 PM (IST) Aug 11
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
07:50 PM (IST) Aug 11
కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. తమ ప్రభుత్వం స్థిరంగా వుందని... రాష్ట్రాభివృద్ది కోసం మరింత కష్టపడి పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో రోజుకు రెండు గంటల చొప్పున అదనంగా పనిచేస్తానని బొమ్మై తెలిపారు.
07:09 PM (IST) Aug 11
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. బాందా జిల్లాలో యమునా నదిలో పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 30 నుంచి 35 మంది వరకు ప్రయాణీకులు వున్నట్లు తెలుస్తోంది. మర్క నుంచి ఫతేపూర్ జిల్లాలోని జారౌలి ఘాట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
06:37 PM (IST) Aug 11
రేపు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు ఈసెట్, ఉదయం 11.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజనీరింగ్, 30, 31 నుంచి అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
05:52 PM (IST) Aug 11
దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్లో ఆగస్టు 28న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ 'మెహంగై పర్ హల్లా బోల్' ర్యాలీ నిర్వహించనుంది. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై వరుస నిరసనలతో కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
04:51 PM (IST) Aug 11
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ(గురువారం) మంచి లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 59,332 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 17,659 వద్ద ముగిసాయి.
04:01 PM (IST) Aug 11
తెలంగాణ ప్రభుత్వం వినతితో బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ సి ఐ ద్వారా ఉప్పుడు బియ్యం కొనుగోలుకు అంగీకరించింది.
03:08 PM (IST) Aug 11
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ప్రారంభమయ్యింది. రాష్ట్రానికి అదనపు నిధుల సమీకరణతో పాటు, మునుగోడు ఉపఎన్నికలపై కేబినెట్ మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అలాగే కొత్త ఫించన్లను ఈ కేబినెట్ లోనే ఆమోదం లభించే అవకాశముంది.
01:59 PM (IST) Aug 11
ఈడి (ఎన్ఫ్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎనిమిదిమంది ఐపిఎస్ అధికారులకు సమన్లు జారీ చేసింది. బొగ్గు స్మగ్లింగ్ కుంబకోణంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐపిఎస్ లను కోరుతూ ఈడి సమన్లు అందించింది.
12:58 PM (IST) Aug 11
భారత క్రికెట్ పాలకమండలిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిసిసిఐ ఛైర్మన్ పదవికి మాజీ టీమిండియా కెప్టెన్ సౌరబ్ గంగూలీ రాజీనామా చేపారు. దీంతో బిసిసిఐ నూతన ఛైర్మన్ గా జై షా నియమితులయ్యారు.
11:40 AM (IST) Aug 11
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అనుబ్రత మండల్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసారు. పశువుల అక్రమ స్మగ్లింగ్ వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అనుబ్రత విచారణకు సహకరించడం లేదంటూ సిబిఐ అరెస్ట్ చేసింది.
10:47 AM (IST) Aug 11
మార్క్ ఆంటోని సినిమా షూటింగ్ లో హీరో విశాల్ ప్రమాదానికి గురయ్యాడు. అతడు గాయపడటంతో వెంటనే మూవీ యూనిట్ హాస్పిటల్ కు తరలించారు.
10:21 AM (IST) Aug 11
బుధవారం సాయంత్రం జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గుండెపోటుకు గురయిన ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ(58) ఆరోగ్యపరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఎయిమ్స్ లో ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. స్టాండప్ కమెడియన్ గానే కాకుండా పలు చిత్రాల్లో నటించి మంచి కమెడియన్ గా అందరినీ నవ్వించిన రాజు ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
09:30 AM (IST) Aug 11
ఎగువన మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్ కు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇన్ ప్లో 7,778 క్యూసెక్స్ కాగా ఔట్ ప్లో 5,070 క్యూసెక్స్ గా వుంది. గత నెలలో ప్రాజెక్ట్ సామర్ధ్యానికి మించి వరద పోటెత్తడంతో భయానక వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.
09:23 AM (IST) Aug 11
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రాజోరి ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడికి దిగడంతో ముగ్గురు భారత సైనికులు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆర్మీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.