లవర్ తో వధువు జంప్... ఆగిన ఎమ్మెల్యే పెళ్లి

By ramya neerukondaFirst Published Sep 4, 2018, 11:45 AM IST
Highlights

తనకిష్టంలేని పెళ్లి జరుగనుండటంతో సంధ్య తన ప్రేమికుడితో పారిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన సంధ్య ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ ఎమ్మెల్యే పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. ఎమ్మెల్యేతో పాటు పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి.. తన లవర్ తో లేచిపోయింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈరోడ్‌ జిల్లా భవానీసాగర్‌ నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఈశ్వరన్‌ (43), గోబిశెట్టిపాళయం సమీపంలోని ఉక్కరం ప్రాంతానికి చెందిన సంధ్య (23) పెళ్లి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ నెల 12న సత్యమంగళం సమీపంలోని బన్నారి అమ్మన్‌ ఆలయంలో వీరి వివాహం జరగాల్సి వుంది. వరుడి తరఫు కుటుంబీకులు, వధువు తరఫు కుటుంబీకులు ఊరాంతా పెళ్లిపత్రికలు పంచిపెట్టి పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. వీరి వివాహనికి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం, మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యేందుకు అంగీకరించారు. పెళ్లి పత్రికలో వీరి పేర్లను కూడా ముద్రించారు.
 
  వారం రోజులుగా ఇరువైపు కుటుంబీకులంతా పెళ్లి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు సంధ్య సత్యమంగళంలో ఉన్న తన సోదరిని చూసి సాయంత్రానికల్లా తిరిగి వస్తానని కుటుంబీకులకు తెలిపి వెళ్లింది. అయితే ఆరోజు రాత్రి ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో సత్యమంగళంలో ఉన్న సంధ్య సోదరికి ఫోన్‌చేసి మాట్లాడారు. సంధ్యా సత్యమంగళంకు రాలేదని తెలియడంతో ఆమె కుటుంబీకులంతా కలవరపడ్డారు. రెండు రోజులుగా ఆమె ఆచూకీ కోసం అన్ని చోట్లా వెదికినా జాడ తెలియలేదు. దీనితో సంధ్య తల్లి తంగమణి కడత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 
  పోలీసులు జరిపిన విచారణలో ఊత్తుకుళి ప్రాంతానికి చెందిన విగ్నేష్‌ అనే యువకుడి రెండేళ్లుగా ప్రేమించిందని, ఈ విషయం తెలిసిన కుటుంబీకులు గుట్టు చప్పుడు కాకుండా అన్నాడీఎంకే శాసనసభ్యుడితో ఆమె పెళ్లి కుదిర్చినట్టు తెలిసింది. తనకిష్టంలేని పెళ్లి జరుగనుండటంతో సంధ్య తన ప్రేమికుడితో పారిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారైన సంధ్య ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

click me!