రాజ్యసభ ఛైర్మన్‌పైకి రూల్‌బుక్.. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు

By Siva KodatiFirst Published Dec 21, 2021, 7:32 PM IST
Highlights

తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై (derek o brien) సస్పెన్షన్ వేటు పడింది. ఛైర్మన్‌పై రూల్ బుక్ విసరడంతో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. రాజ్యసభలో (rajya sabha)ఎన్నికల చట్ట సవరణ, 12 మంది సభ్యులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై (derek o brien) సస్పెన్షన్ వేటు పడింది. ఛైర్మన్‌పై రూల్ బుక్ విసరడంతో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. రాజ్యసభలో (rajya sabha)ఎన్నికల చట్ట సవరణ, 12 మంది సభ్యులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సమయంలోనే బయటకు వెళ్తున్న ఓబ్రెయిన్ .. ఛైర్మన్‌పై రూల్ బుక్ విసిరారు. దీంతో ఆయనను ఈ నెల 23 వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. 

కాగా.. శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, సీపీఎం ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ ఎంపీ బినయ్ విశ్వమ్, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు దోల సేన్, శాంత ఛెత్రిలను సస్పెండ్ చేశారు. వీరితోపాటు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేశాడు. వీరిలో ఫులో దేవి నేతం, ఛాయ వర్మ, రిపున్ బోరా, రాజమని పటేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అఖిలే ప్రసాద్ సింగ్‌లు ఉన్నారు.

Also Read: వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన ఎంపీలు.. ఆయన నిర్వహించిన వేడుకకు హాజరు

గత పార్లమెంటు సమావేశాల చివరి రోజున 12 రాజ్యసభ ఎంపీల ప్రవర్తన అభ్యంతరకరంగా ఉన్నదని  చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అందుకు అంగీకరించలేదు. రాజ్యసభ ప్రతిష్టను దెబ్బతీసేలా బల్లలు ఎక్కి, నల్ల జెండాలు ఊపిన గందరగోళాన్ని సృష్టించిన ఆ ఎంపీలు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని అన్నారు. వారు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే అప్పుడు వారిపై సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. సస్పెండ్ అయిన ఎంపీలు క్షమాపణలు చెబితే వారిపపై విధించిన వేటును ఎత్తేస్తామని వెల్లడించింది. కానీ, ప్రతిపక్షాలు మాత్రం క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశాయి. రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర వారు ధర్నాలు చేస్తున్నారు. వారి ధర్నాకు మద్దతుగా ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా అక్కడికి చేరుతున్నారు. సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఇతర అంశాలతోపాటు ఈ సస్పెన్షన్ వేటుపై ప్రతిపక్షాలు రాజ్యసభలో గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో చర్చ చాలా వరకు తగ్గిపోయింది. బిల్లులపై చర్చ, వాటి ఆమోదం గత వారంలో అతి స్వల్ప స్థాయిలో జరిగాయి. 
 

click me!