దారుణం : క్షుద్ర పూజల కోసం మూడేళ్ల బాలుడి కిడ్నాప్, మట్టిలో పూడ్చిపెట్టి..

By AN TeluguFirst Published Jul 26, 2021, 3:48 PM IST
Highlights

కొంతమంది క్షుద్రపూజల కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసి ఖననం చేసినట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని భూమిలో నుంచి వెలికి తీశారు.  అయితే ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.  

లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పూజల కోసం ఓ మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి పూడ్చి పెట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... చంబల్ నది సమీపంలో ఓ అడవి ప్రాంతంలో అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు అప్రమత్తం కావడంతో శనివారం అర్ధరాత్రి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ ఘటన పినాహాట్‌ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. కొంతమంది క్షుద్రపూజల కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసి ఖననం చేసినట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని భూమిలో నుంచి వెలికి తీశారు.  అయితే ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.  

అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి పంపారు. స్థానిక అధికారుల ప్రకారం.. బాలుడిని ఖననం చేసిన చోట ధూపం, కర్రలు, క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులు ఉండటంతో పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు 

ఈ కేసులో ఒక మహిళతో సహా నలుగురు నిందితులను జాతీయ భద్రతా చట్టం  (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ప్రాంతంలో ఏడేళ్ల బాలికను 2020 నవంబర్ లో క్షుద్ర పూజల కోసం కిడ్నాప్ చేయడంతో దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. 

click me!