
Terror conspiracy targeting PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా బీహార్ లో జరుగుతున్న ఉగ్రకుట్రను పోలీసులు ఛేదించారు. అలాగే, దీనితో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోకరిని కూడా గుర్తించినట్టు సంబంధిత వర్గాల సమాచారం.
వివరాల్లోకెళ్తే.. బీహార్ రాజధాని పాట్నాలో అనుమానిత టెర్రరిస్టు మాడ్యూల్ను ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంబంధిత కుట్ర 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని యోచిస్తోంది. జూలై 12న ఆయన పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకునేందుకు కూడా కుట్ర జరిగింది. దీనితో సంబంధమున్న ఇద్దరు నిందితులు అరెస్టు కాగా, వారిని అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్గా గుర్తించారు.
ప్రధాని మోడీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందుతున్నారు. జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునేందుకు వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహించారు. అనుమానిత ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి - '2047 ఇండియా టువర్డ్స్ రూల్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా'. వారి నుంచి 25 పీఎఫ్ఐ కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు, కేంద్ర సంస్థలు జూలై 11 న నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాయి.
కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి తీవ్రవాద కుట్రలో శిక్షణ తీసుకునేందుకు యువకులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారని దర్యాప్తులో తేలింది. అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి విరాళాలు పొందుతున్నారు. దేశంలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు. "అరెస్టయిన వ్యక్తులను రిటైర్డ్ జార్ఖండ్ పోలీసు అధికారి మహమ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్గా గుర్తించారు. వారికి PFIతో సంబంధాలు ఉన్నాయి. జల్లావుద్దీన్ ఇంతకుముందు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI)తో సంబంధం కలిగి ఉన్నాడు" అని ఫుల్వారీ షరీఫ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( ఏఎస్పీ మనీష్ కుమార్ తెలిపారు.
"వారు స్థానికులకు కత్తులు ఇవ్వడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించేవారు. మతపరమైన హింసకు ప్రేరేపించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు పాట్నాలో వారిని సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ సందర్శకులు బీహార్ రాజధానిలోని హోటళ్లలో బస చేస్తూ తమ పేర్లను మార్చుకునేవారు. వారి గుర్తింపును దాచిపెట్టడానికి ఇలాంటి అనేక ప్రయత్నాలు చేశారు" అని ఆయన అన్నారు. పాట్నా టెర్రర్ మాడ్యూల్ విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేరింది. ఈ కేసులో మూడో నిందితుడిని కూడా ఎన్ఐఏ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.