
బీహార్ : బీహార్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థిని టీచర్లు విచక్షణ రహితంగా కొట్టడంతో మృతి చెందాడు. అతను చేసిన తప్పు బహిరంగంగా పొగతాగడం. చెప్పినా వినడం లేదని ఆగ్రహానికి గురైన టీచర్లు అతడిని విచక్షణా రహితంగా బెల్టుతో కొట్టారు. దీంతో ఆ విద్యార్థి మృతి చెందాడు. బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఈ జిల్లాలోని ఓ పాఠశాలలో మధుబన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. శనివారం నాడు అతడిని పాఠశాల ఉపాధ్యాయులు బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టారు. ఆ సమయంలో అతను స్నేహితులతో కలిసి పొగ తాగుతున్నాడు. అది పాఠశాల చైర్మన్ విజయ్ కుమార్ చూశాడు.
పగ్గపగలే ఇంత దారుణమా.. తుపాకులతో బెదిరిస్తూ కారును వెంబడించి..
ఆ తర్వాత ఆ విద్యార్థిని పాఠశాల ఆవరణలోకి ఈడ్చుకెళ్ళి బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. మరి కొంతమంది టీచర్లు అతడితో కలిశారు. వారు కూడా కొట్టారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వెంటనే విద్యార్థిని ముజఫర్పూర్ లోని ఆసుపత్రికి తరలించి, అక్కడ చికిత్స అందించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే.. విద్యార్థి పరిస్థితి విషమించి, మృతి చెందాడు.
మృతి చెందిన విద్యార్థి బజరంగీ కుమార్ (14) బంజరియాకు చెందిన హరికిషోర్ రాయ్ కుమారుడు. మధుబన్లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేవాడు. చనిపోయిన తరువాత పాఠశాల డైరెక్టర్ బజరంగీ మరణాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. బంధువులు ముజఫర్పూర్కు చేరుకుని మృతదేహాన్ని మధుబన్లోని బంజరియాకు తరలించారు. ఆ తరువాతే బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పక్డిదయాల్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్, ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ పాండే, మధుబన్ పోలీస్ స్టేషన్ ప్రమోద్ కుమార్ పాశ్వాన్ బంజరియాకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం ఉదయం సదర్ ఆస్పత్రికి తరలించారు.
పక్డిదయాల్ ఎస్డిఓ కుమార్ రవీంద్ర వెంటనే పాఠశాలకు సీలు వేయాలని సిఓ, ఎస్హెచ్ఓలను ఆదేశించారు. ప్రస్తుతం పాఠశాలకు సీల్ వేసి నివేదికను కార్యాలయంలో అందజేయాలని ఆదేశాలు అందాయి. అయితే, తాము విద్యార్థిని కొట్టలేదని పాఠశాల డైరెక్టర్ అన్నారు. సిగరెట్ తాగుతుండడంతో బెదిరించామని.. తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయంతో విషం తాగాడు. అనంతరం చికిత్స నిమిత్తం ముజఫర్పూర్కు తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.
స్కూల్ డైరెక్టర్, అతని బంధువును అరెస్ట్ చేయడానికి వారి ఇళ్లమీద దాడులు చేశామని పక్డిదయాల్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. ఇద్దరూ ఇంట్లో లేరు. పాఠశాలకు తాళం వేసి ఉంది. పాఠశాలకు సీలు వేయాలని డీఈవోకు లేఖ రాశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అతని ఒంటిపై గాయాల ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు.
రెండు నెలల క్రితమే బజరంగి పాఠశాల హాస్టల్లో చేర్పించినట్లు బంధువులు చెబుతున్నారు. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చాడు. శనివారం సాయంత్రం, బజరంగీ తన స్నేహితుడితో కలిసి మొబైల్ రిపేర్ చేసుకోవడానికి మధుబన్కు వెళ్లాడు. మొబైల్ రిపేర్ చేసుకుని తిరిగి వస్తుండగా హార్దియా బ్రిడ్జి దగ్గర ఆగి పొగ తాగడం ప్రారంభించాడని అతని తల్లి, సోదరి చెప్పారు. స్కూల్ డైరెక్టర్, అతని బంధువు టీచర్ బజరంగీ స్మోకింగ్ చేయడం చూశారు. అతన్ని పట్టుకుని పాఠశాలకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత డైరెక్టర్ బజరంగీ తండ్రి హరికిషోర్ రాయ్తో ఫోన్లో మాట్లాడాడు. వెళ్లే సరికే కుమారుడు చనిపోయాడని వారు తెలిపారు.