
సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన ఓ స్కూల్ టీచర్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సుభాష్ బ్రిడ్జి సమీపంలోని కేశవనగర్లో మనీషా భావ్ సర్ అనే 40 ఏళ్ల ఉపాధ్యాయురాలు నివాసం ఉంటుంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం నగర పోలీసు కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
అయితే ఆమె ఒక వాట్సాప్ గ్రూప్ చేసిన పోస్టు ద్వారా.. ముస్లిం సమాజం మతపరమైన మనోభావాలను దెబ్బతీసింది అని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆమె ప్రకటన ఉందని.. అది ప్రజల్లో భయాన్ని సృష్టించిందని చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబందించి మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు భావ్ సర్ను అరెస్ట్ చేశారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్లతో పాటుగా, ఐటీ చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
భావ్సర్ విషయానికి వస్తే.. ఆమె ఎంకామ్ పూర్తి చేశాడు. పదేళ్లుగా టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్హెచ్ కపాడియా, లిటిల్ ఫ్లవర్, త్రిపాద సింగపూర్ ఇంటర్నేషనల్, పొద్దార్ ఇంటర్నేషనల్, నెల్సన్ హయ్యర్ సెకండరీ స్కూల్, డూన్ ఇంటర్నేషనల్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, జీఎన్సీ స్కూల్స్లో ఆమె బోధించారు. దాదాపు నెల రోజులుగా ఆర్హెచ్ కపాడియా పాఠశాలలో బోధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
భావ్సర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు విస్తృతంగా వైరల్ కావడంతో.. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు కమిషనర్ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
అయితే సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై స్పందించిన భావ్సర్.. తాను తప్పు చేశానని అంగీకరించారు. ‘‘నేను నా తప్పును గ్రహించాను. చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నాను. నేను అన్ని విశ్వాసాలను నమ్ముతాను’’ అని ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.