
దేశవ్యాప్తంగా వైద్య విద్యకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’’ (నీట్)పై తమిళనాడు తొలి నుంచి వ్యతిరేకంగా వున్న సంగతి తెలిసిందే. దీని వల్ల పలువురు విద్యార్థులు సీటు సంపాదించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే తమిళ సర్కార్ .. దానిని రద్దు చేయాలంటూ కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే నీట్ను రద్దు చేయాలంటూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని సైతం ఆమోదించింది. తాజాగా ఇవాళ ఉదయం నీట్ కు వ్యతిరేకంగా చెన్నైలోని (chennai) బీజేపీ ప్రధాన కార్యాలయంపై (tamilnadu bjp office) దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు.
ఇది వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వినోదన్ అనే రౌడీ షీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మూడు సీసాల్లో పెట్రోల్ నింపి వాటిని బీజేపీ కార్యాలయంపైకి విసిరాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు గతంలో కూడా ఇదే తరహాలో పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డాడని చెప్పారు. అతను డ్రగ్స్ ఎడిక్ట్ అని, ఇప్పటికే అతడిపై గూండాయాక్ట్ కింద కేసు కూడా నమోదైందని పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ దాడిలో వినోదన్ కాకుండా ఎంత మంది పాల్గొన్నారో తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు .. ఈ దాడి ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.
కాగా.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)కి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ మంగళవారం మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. నీట్ నుంచి తమిళనాడు (Thamilnadu)ను మినహాయింపు ఇవ్వాలని ఈ బిల్ (bill)లో ప్రభుత్వం పేర్కొంది. దీనిని గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.
వాస్తవానికి ఎంకే స్టాలిన్ (M k stalin) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నీట్ ను రద్దు చేస్తూ గతేడాది సెప్టెంబర్ లోనే అసెంబ్లీ (assembly) బిల్ పాస్ చేసింది. అయితే దీనిని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించలేదు. ఆ బిల్లు పేద విద్యార్థులకు వ్యతిరేకం అంటూ దానిని గురువారం తిరిగి పంపించారు. దీంతో కొన్ని రోజుల మందు సీఎం స్టాలిన్ ఓ ప్రకటన చేశారు. నీట్ రద్దు కోసం బిల్ ఆమోదించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశ పరుస్తామని తెలిపారు. ఆ ప్రకటన నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏక గ్రీవంగా బిల్ పాస్ చేశారు.
2021లో సెప్టెంబర్ లో నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలం (selam) ప్రాంతంలో ఓ మెడికల్ సీటు ఆశవాహురాలు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో నీట్ పై పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. మెడిసిన్, డెంటిస్ట్రీ, ఇండియన్ మెడిసిన్, హోమియోపతిలోని యూజీ కోర్సులకు ఎంట్రెన్స్ టెస్ట్ లో (12వ తరగతి) సాధించిన మార్కుల ఆధారంగా వచ్చే పదేళ్ల వరకు ప్రవేశాలు కల్పించాలని ఆ బిల్లు కోరింది.